తెలుగు ప్రేక్షకుల కోసం ‘కేసరి చాప్టర్ 2’
సురేష్ ప్రొడక్షన్స్ కూడా అడుగులేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి ఛాప్టర్ 2’ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు.;

ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ సినిమా ట్రెండ్ అవుతుందో, వెంటనే ఆ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇతర భాషల్లో హిట్టైన చిత్రాలను తెలుగులో చూడాలన్న తహతహలతో ముందుగా తమ థియేటర్లలో చూసేయాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ ట్రెండ్ను ముందుగానే గమనించిన గీతా ఆర్ట్స్, కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ తెలుగు డబ్బింగ్ హక్కులను వెంటనే కొని మన ప్రేక్షకులకు చూపించారు. ఫలితంగా, తెలుగు వెర్షన్ కూడా భారీగా కలెక్షన్స్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలే తెచ్చిపెట్టింది.
దీని తర్వాత మలయాళం, తమిళం సినిమాలు ట్రెండింగ్ సినిమా అనే ట్యాగ్తో తెలుగులోకి వచ్చి మంచి వసూళ్లు అందుకుంటున్నాయి. తాజాగా బాలీవుడ్ నుండి వచ్చిన ‘ఛావా’ అనే సినిమా రైట్స్ను కొంచెం ఆలస్యంగా అయినా సొంతం చేసుకున్న గీతా ఆర్ట్స్, ట్రెండ్ ఉంది కాబట్టి తెలుగులో రిలీజ్ చేసి క్యాష్ చేసుకున్నారు. ప్రేక్షకులు ఈ సినిమా కోసం థియేటర్లకు వెళ్లడం చూస్తే, ట్రెండ్ మీద వారి నమ్మకం ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
ఇప్పుడు అదే బాటలో సురేష్ ప్రొడక్షన్స్ కూడా అడుగులేస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి ఛాప్టర్ 2’ సినిమాను తెలుగులోకి తీసుకురావడానికి సిద్ధమయ్యారు. అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటికే హిందీలో రిలీజై నెలకు పైగానే అవుతోంది. ప్రస్తుతం ట్రెండ్లో కూడా లేదు.
అయినా, ‘కేసరి ఛాప్టర్ 2’ తెలుగు ప్రేక్షకుల ముందుకు మే 23న రాబోతోంది. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ట్రెండ్ లేదు, ఆలస్యంగా విడుదలవుతోంది అన్నది ఒక వైపు. కానీ మన ప్రేక్షకులు ట్రెండింగ్ సినిమా అనే ఒకే ఒక్క పేరుతో థియేటర్లకు వెళ్లిన దృష్ట్యా, ఈ సినిమాకు కూడా ఆదరణ దక్కుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.