పాత సెట్లో సైఫ్ ఆలీఖాన్ కొత్త ప్రయాణం !
బాలీవుడ్ స్టార్ .. సైఫ్ అలీ ఖాన్ ఇటీవల ‘జువెల్ థీఫ్: ది హైస్ట్ బిగిన్స్’ అనే తన కొత్త ప్రాజెక్ట్ను అఫీషియల్ గా అనౌన్స్ చేసి అభిమానులను ఖుషీ చేశాడు. వివిధ పాత్రల్లో తన ప్రతిభను చాటుకున్న అతడు ఇప్పుడు మరో చిత్ర షూటింగ్ను ప్రారంభించాడు. అయితే.. ఈ ప్రాజెక్ట్కు ఇంకా పేరు ఖరారు కాలేదు. సెట్స్ నుంచి లీకైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, అందులో సైఫ్ అలీ ఖాన్ కొత్త లుక్లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
తాజా ఫోటోలలో సైఫ్ క్లాసిక్ లుక్ ఆకట్టుకుంటోంది. మీసం, సైడ్-పార్టెడ్ హెయిర్స్టైల్తో ఫిట్గా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. ఇది అతడి కొత్త చిత్రంలోని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది. ఈ ప్రాజెక్ట్కు మరింత ప్రత్యేకతను కలిగిస్తోందేంటంటే.. ఈ లొకేషన్ కు, సైఫ్ అలీ ఖాన్కు ఎమోషనల్ కనెక్ట్ ఉంది. 1993లో తన తొలి చిత్రం ‘పరంపర’ షూటింగ్ జరిగిన అదే ప్రదేశంలో ఇప్పుడు ఆయన కొత్త ప్రాజెక్ట్ను చిత్రీకరిస్తున్నారు.
‘పరంపర’ లో సైఫ్తో పాటు నీలం కోఠారి, సునీల్ దత్, వినోద్ ఖన్నా, ఆమిర్ ఖాన్, రవీనా టండన్, అశ్విని భావే, అనుపమ్ ఖేర్, రమ్య కృష్ణ నటించారు. ఇదే చిత్రం ద్వారా రమ్యకృష్ణ బాలీవుడ్కు పరిచయమైంది. సైఫ్ తాజా ప్రాజెక్ట్పై చిత్రబృందం ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కథా నేపథ్యం, సినిమా తరహా గురించి సస్పెన్స్ కొనసాగుతోంది. అయినా, సెట్స్ నుంచి వచ్చిన చిత్రాలు అభిమానుల్లో భారీగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. సైఫ్ లుక్ గంభీరంగా, ఇంటెన్స్గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.