మగవాళ్ళు ఒక్క నిమిషం కూడా భరించలేరు : జాన్వీ కపూర్

కొందరు పురుషులు ఋతుస్రావం నొప్పిని తేలికగా తీసిపారేయడాన్ని తప్పుపట్టింది. ఋతుస్రావం నొప్పి , హార్మోనల్ సమస్యలను తక్కువగా చూసే వైఖరిని ఆమె ఎత్తి చూపింది.;

By :  K R K
Update: 2025-04-20 04:21 GMT

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్‌ కు జోడీగా ‘పెద్ది’ అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంతో పాటు.. ఆమె బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో కూడా బిజీగా ఉంది. వీటితో పాటు అమ్మడు.. ఫ్యాషన్ ఐకాన్‌గా తన ముద్ర వేస్తోంది. ఇటీవల, ఆమె స్నేహితురాలు, వ్యాపారవేత్త అనన్య బిర్లా ఆమెకు లగ్జరీ కారు బహుమతిగా ఇవ్వడంతో జాన్వీ వార్తల్లో నిలిచింది.

మరోవైపు.. జాన్వీ పలు ఇంటర్వ్యూలతో పలు అంశాలపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వినిపిస్తూ హెడ్‌లైన్స్‌లో ఉంటోంది. ఇటీవల ఆమె మహిళలు ఎదుర్కొనే హార్మోనల్ మార్పుల గురించి మాట్లాడుతూ.. కొందరు పురుషులు ఋతుస్రావం నొప్పిని తేలికగా తీసిపారేయడాన్ని తప్పుపట్టింది. ఋతుస్రావం నొప్పి , హార్మోనల్ సమస్యలను తక్కువగా చూసే వైఖరిని ఆమె ఎత్తి చూపింది.

జాన్వీ మాట్లాడుతూ.. “పురుషులు ఈ నొప్పిని, మూడ్ స్వింగ్స్‌ను ఒక్క నిమిషం కూడా భరించలేరని నేను హామీ ఇస్తున్నాను.” అంటూ ఆమె చేసిన ఈ స్పష్టమైన వ్యాఖ్యలు ఆన్‌లైన్‌లో చాలా మంది మహిళలలో సానుభూతిని కలిగించాయి సోషల్ మీడియాలో విస్తృత మద్దతు పొందాయి. అయితే, కొందరు ఈ సున్నితమైన అంశంపై ఆమె చాలా సాధారణంగా మాట్లాడిందని భావించారు.

ఇక ప్రాజెక్ట్స్ విషయానికొస్తే .. ప్రస్తుతం జాన్వీ కపూర్ షెడ్యూల్ బిజీగా ఉంది. ఆమె బాలీవుడ్ చిత్రం ‘పరం సుందరి’ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. తెలుగులో బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రామ్ చరణ్‌తో ‘పెద్ది’లో నటిస్తోంది. గత ఏడాది ఆమె ఎన్టీఆర్‌తో ‘దేవర’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా సీక్వెల్ లో కూడా ఆమె నటించిన తంగం పాత్ర కొనసాగనుంది.

Tags:    

Similar News