తెలంగాణలో సినీ వేడుకకు రెడీ..!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది. రేపు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరగబోయే ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు‘ కార్యక్రమం సినీ సెలబ్రిటీలకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన వేడుకగా నిలవనుంది.;
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీ పరిశ్రమలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమవుతోంది. రేపు హైదరాబాద్లోని హైటెక్స్ లో జరగబోయే ‘గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు‘ కార్యక్రమం సినీ సెలబ్రిటీలకు, సినీ ప్రియులకు ఒక అద్భుతమైన వేడుకగా నిలవనుంది. 14 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో సినీ అవార్డుల సంబరం తిరిగి మొదలవుతుండటం విశేషం. ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ఆంధ్రప్రదేశ్లో జరిగే నంది అవార్డులు ఆగిపోయాయి. దీంతో గత దశాబ్దంలో తెలుగు సినిమా రంగంలో ఎన్నో గొప్ప చిత్రాలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు గుర్తింపు లేకుండా మిగిలిపోయారు. ఈ లోటును భర్తీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ఏర్పాటు చేసింది. ప్రజాకవి, విప్లవ గాయకుడు గద్దర్ పేరిట ఈ అవార్డులు ఏర్పాటు చేయడం ఈ వేడుకకు మరింత వన్నె తెస్తోంది.
2014 నుంచి 2024 వరకు విడుదలైన చిత్రాలకు గద్దర్ అవార్డులు అందజేస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన 2014 జూన్ 2 నుంచి సినిమాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. 2014 నుంచి 2023 వరకూ ఏడాదికి మూడు ఉత్తమ చిత్రాలకు అవార్డులను అందజేస్తుంది. అలాగే 2024వ సంవత్సరానికి సంబంధించి అన్ని విభాగాలలోనూ అవార్డులను అందజేయనున్నారు.
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక శనివారం సాయంత్రం హైటెక్స్ వేదికగా అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు హాజరుకానున్నారు.
ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమలోని ప్రముఖ నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ అవార్డు అందుకోనున్న బాలకృష్ణ, 2024వ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్, కాంతారావు అవార్డు అందుకోనున్న విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ గద్దర్ అవార్డుల వేడుకకు స్టార్ అట్రాక్షన్ గా నిలవనున్నారు.