మెగాస్టార్ డబుల్ ధమాకా
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు.;
మెగాస్టార్ చిరంజీవి చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకవైపు సోషియో-ఫాంటసీ ‘విశ్వంభర’, మరోవైపు ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మెగా157’ సినిమాలతో మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.
‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘విశ్వంభర’ సినిమా 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. హీరోయిన్గా త్రిష, ఇతర కీలక పాత్రల్లో అషికా రంగనాథ్, ఇషా చావ్లా, సురభి నటిస్తున్నారు. మౌనీ రాయ్ ఓ స్పెషల్ సాంగ్ కోసం సెలక్ట్ అవ్వగా, జూలై 25 నుంచి ఈ పాట షూట్ ప్రారంభం కానుందట. ఈ సాంగ్ పూర్తయితే షూటింగ్ పూర్తైనట్టే.
ఈ స్పెషల్ సాంగ్లో చిరంజీవి పాత మాస్ హిట్స్ అయిన ‘ఈ పేటకు నేనే మేస్త్రి, రూప్ తేరా మస్తానా, రగులుతోంది మొగలి పొద’ పాటల థీమ్స్ వాడినట్టు సమాచారం. టోటల్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ 18 లేదా 25న 'విశ్వంభర'ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మరోవైపు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా157’ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది. ఇందులో లేడీ సూపర్ స్టార్ నయనతార చిరంజీవికి జోడిగా నటిస్తుంది. గతంలో 'సైరా'లో చిరంజీవికి భార్య పాత్రలోనూ, గాడ్ ఫాదర్’లో చెల్లెలుగానూ నటించింది నయనతార.
లేటెస్ట్ గా చిరు, నయన లపై ఓ రొమాంటిక్ సాంగ్ను కేరళలో చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్న ఈ పాట, ఫ్యామిలీ ఆడియన్స్ను అలరించేలా ఉండనుందట. 'మెగా157' షూటింగ్ అక్టోబర్లో పూర్తై, సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. మొత్తంగా మెగాస్టార్ ఇలా ఒకే సమయంలో రెండు విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను డబుల్ ధమాకా అందించడానికి రెడీ అవుతున్నాడు.