ప్రభుత్వ అవార్డుల్ని గౌరవించాలి.. దిల్ రాజు!

ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్ని గౌరవంగా తీసుకోవాలని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. జూన్ 14న హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుక అనంతరం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.;

By :  S D R
Update: 2025-06-15 14:33 GMT

ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్ని గౌరవంగా తీసుకోవాలని నిర్మాత, ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు అన్నారు. జూన్ 14న హైటెక్స్‌లో ఘనంగా నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 వేడుక అనంతరం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు, సూచనలు పరిశ్రమకు మార్గదర్శకంగా నిలిచేలా ఉన్నాయి.

గద్దర్ అవార్డుల కోసం గత ఆరు నెలలుగా ఎంతో గ్రౌండ్ వర్క్ చేశామని దిల్ రాజు తెలిపారు. 2014 నుంచి 2023 వరకూ ప్రతి సంవత్సరానికి మూడు ఉత్తమ చిత్రాలను ఎంపిక చేయడం సులభం కాదని చెప్పారు. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, సినిమా ఎంపికల్లో వచ్చిన అభిప్రాయ భేదాలను సమర్ధవంతంగా పరిష్కరించామన్నారు.

వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 గంటల 15 నిమిషాల పాటు హాజరవడం ఎంతో ప్రాముఖ్యత పొందింది. 'ఎంతసేపు ఉండాలి?' అన్న సీఎం ప్రశ్నకు.. 'పూర్తయ్యే వరకూ ఉంటే చాలా హ్యాపీ సర్' అని చెప్పినట్లు దిల్ రాజు గుర్తుచేశారు. కార్యక్రమం విజయవంతం కావడంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక పాత్ర పోషించారని కృతజ్ఞతలు తెలిపారు.

భవిష్యత్తులో ప్రభుత్వం ఇచ్చే అవార్డుల పట్ల సినీ ప్రముఖులు మరింత బాధ్యతతో వ్యవహరించాలన్నారు. షూటింగ్‌లు ఉన్నా, ఇతర కార్యక్రమాలు ఉన్నా.. అవార్డుల వేడుకలకు తప్పకుండా హాజరయ్యేలా డేట్స్ డైరీలో ముందే లాక్ చేసుకోవాలని సూచించారు. అవార్డులను స్వయంగా స్వీకరించకపోయిన సందర్భాల్లో కొంత అసంతృప్తి ఉన్నట్లు వెల్లడించారు. ఇలా జరగకుండా చూసుకోవాలని సూచించారు.

వేడుకలో కొన్ని కమ్యూనికేషన్ గ్యాప్స్ వల్ల చిన్నచిన్న పొరపాట్లు జరిగాయని, ఎవరైనా హర్ట్ అయ్యుంటే క్షమాపణలు చెబుతున్నట్లు దిల్ రాజు తెలిపారు. ఈవెంట్ విజయవంతం కావడంలో మీడియా పాత్రను ప్రశంసించారు. హాజరైన నటీనటులందరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా సినిమా అవార్డులు ప్రకటించనున్నట్లు సంకేతాలిచ్చారు. అవి నంది అవార్డుల తరహాలో ఉండే అవకాశముందని దిల్‌రాజు పేర్కొన్నారు.

Tags:    

Similar News