ఆగస్ట్ 30న విశాఖలో పవన్ భారీ బహిరంగ సభ
పార్టీ విస్తృత స్థాయి సమావేశాలకు విశాఖ వేదిక.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక చర్చలు;
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నంకు చేరుకుంటున్నారు. ఆయన పర్యటన మూడు రోజుల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా విశాఖలో పార్టీ కార్యక్రమాలు, విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రేపు, ఎల్లుండి జనసేన లెజిస్లేచర్ మీటింగ్ జరుగనుంది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. అదేవిధంగా, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో పవన్ కల్యాణ్ ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహించనున్నారు.
ఈనెల 30న విశాఖలో భారీ బహిరంగ సభ జరుగనుంది. ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి పార్టీ లక్ష్యాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలు వివరించనున్నారు. సభకు ఇప్పటికే భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 15 వేల మంది ఆహ్వానితులు తరలివచ్చేలా ఆహ్వానాలు పంపబడ్డాయి. జనసేన కార్యకర్తలు, అభిమానులు కూడా విస్తృతంగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పార్టీ నేతలు పిలుపునిస్తున్నారు.