ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ నుంచి కార్వాన్ వాహనాలకు శుభారంభం
విలాసవంతమైన కార్వాన్ల ద్వారా పర్యాటక రంగంలో ఏపీ పర్యాటక రంగం కొత్త అధ్యాయం;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ గారితో కలిసి నేడు విజయవాడలో జరిగిన ‘టూరిజం కాన్క్లేవ్’ కార్యక్రమంలో ‘కార్వాన్’ వాహనాలకు పచ్చ జెండా ఊపి ఘనంగా ప్రారంభించారు.
ఇప్పటి వరకు ఈ విలాసవంతమైన కార్వాన్ వాహనాలు సినిమా ప్రముఖులు, రాజకీయ నేతల వద్ద మాత్రమే కనిపించేవి. అయితే, ఇప్పుడు పర్యాటక శాఖ ద్వారా వీటిని ప్రజలకూ అందుబాటులోకి తీసుకురావడం విశేషం. వివిధ రంగాల్లోని ప్రముఖులు ఇప్పటికే కార్వాన్లను ప్రయాణ సాధనంగా ఉపయోగించడాన్ని చూసి, సామాన్య ప్రజానీకానికి కూడా ఇది చేరువయ్యే దిశగా ఈ ప్రకటన జరగడం ముఖ్యమైన మైలురాయిగా మారింది.
ఈ కార్వాన్ వాహనాల్లో పర్యాటక ప్రయాణానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు కలిగి ఉంటాయి.హై-ఎండ్ ఎయిర్ కండిషనింగ్,నిద్రించే మంచాలు, విశ్రాంతి కోసం సోఫాలు,డైనింగ్ టేబుల్,మినీ కిచెన్,ఉచిత వైఫై, టీవీ,ఆధునిక టాయిలెట్ సదుపాయం కలిగి ఉంటాయి.ఒక కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణించాలనుకునే వారికి ఇది ఒక సరికొత్త అనుభూతిని అందించనుంది.
ఇప్పటికీ ఈ కార్వాన్లు అధిక ఆదాయ వర్గాలకే పరిమితమైనా, మధ్యతరగతి ప్రజలు సౌకర్యాల కోసం ఖర్చుకు వెనకాడకపోవడం వల్ల, వీటి బుకింగ్స్కు మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. వందే భారత్ రైళ్లు, వోల్వో బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా, కార్వాన్ వాహనాలకు కూడా పర్యాటకుల నుండి మంచి ఆదరణ లభించవచ్చు.
ఈ కొత్త ప్రయోగం విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో ఒక మలుపు తీసుకురాగలదని నిపుణులు భావిస్తున్నారు.త్వరలోనే ఈ కార్వాన్ల బుకింగ్ విధానం, రూట్ మ్యాప్, టారిఫ్ వివరాలు ప్రకటించనున్నట్లు పర్యాటక శాఖ వెల్లడించింది.