సప్తగిరి ఎక్స్ప్రెస్లో ఉచిత యాత్ర
భక్తుల అభిప్రాయం మేరకు నిబంధన సడలింపు,ఏపీ మహిళలకు మాత్రమే వర్తించే ప్రత్యేక అవకాశం - గుర్తింపు కార్డు చూపితే తిరుపతి నుంచి తిరుమలపైకి ఉచిత ప్రయాణం;
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక సౌకర్యం ప్రకటించింది. ఇకపై తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వెళ్లే ఆర్టీసీ సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ముందుగా ఘాట్ రోడ్లలో ఉచితం కాదని నిబంధన ఉండేది. కానీ భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తేసింది.
తిరుపతి వరకు అన్ని ఆర్టీసీ బస్సులు వస్తాయి. అక్కడి నుంచి తిరుమల కొండపైకి సప్తగిరి ఎక్స్ప్రెస్ బస్సులు నడుస్తాయి. వీటిలో కూడా మహిళలకు ఉచితం వర్తిస్తుంది. అయితే భద్రత కారణంగా సీటింగ్ కెపాసిటీ మేరకే ప్రయాణికులను అనుమతిస్తారు. నిలబడి వెళ్లే అవకాశం ఉండదు. త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి. డిమాండ్ను బట్టి బస్సుల సంఖ్య పెంచనున్నారు.
ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కేవలం ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళలకే వర్తిస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడీ వంటి గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల మహిళలు మాత్రం సాధారణ టిక్కెట్ కొనుగోలు చేయాలి.
ఇటీవలి కాలంలో తిరుమలకు వ్యక్తిగత వాహనాల్లో వెళ్ళేవారి సంఖ్య బస్సుల్లో వెళ్ళేవారికన్నా ఎక్కువైంది. కానీ ఇప్పుడు ఉచిత సౌకర్యం వలన మహిళా భక్తులు పెద్ద ఎత్తున బస్సుల్లోనే ప్రయాణిస్తారని అధికారులు భావిస్తున్నారు. వారాంతాల్లో బస్సులు పూర్తిగా నిండిపోవడం ఖాయం.