మహేష్ బాబుకు నోటీసులు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నాడు.;
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రియల్ ఎస్టేట్ వివాదంలో చిక్కుకున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ మహిళా వైద్యురాలు, మరో వ్యక్తి కలిసి బాలాపూర్లో ప్లాట్లు కొనుగోలు చేయడంలో మోసపోయినట్టు ఆరోపిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. వారు 'మెస్సర్స్ సాయి సూర్య డెవలపర్స్' అనే సంస్థలో ఒక్కో ప్లాట్ కోసం రూ.34.80 లక్షలు చెల్లించినట్టు తెలిపారు.
బ్రోచర్లో మహేష్ బాబు ఫోటో, అన్ని అనుమతులున్నాయని చేసిన హామీలను నమ్మి డబ్బు చెల్లించామని బాధితులు పేర్కొన్నారు. అయితే తర్వాత లేఅవుట్కి అనుమతులు లేవని తేలిందని, సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తా కేవలం రూ.15 లక్షలు మాత్రమే వాపసు చేసినట్టు వారు వాపోయారు.
ఈ నేపథ్యంలో కంపెనీ, యజమాని, ప్రచారకర్తగా ఉన్న మహేష్ బాబును మూడో ప్రతివాదిగా చేర్చి ఫిర్యాదు దాఖలైంది. దీనిపై విచారణ కోసం జూలై 8న వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరుకావాలని కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే.