జోజు జార్జ్, ఊర్వశి ‘ఆశ’ ప్రారంభం!
'ఆశ' సినిమా బహుభాషల్లో విడుదల కానుంది. వినాయక అజిత్ నిర్మిస్తున్నారు. విజయరాఘవన్, రమేష్ గిరిజ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.;
మాలీవుడ్ సీనియర్ నటీమణి ఊర్వశి, విలక్షణ నటుడు జోజు జార్జ్.. 'ఆశ' అనే కొత్త సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తాజాగా కొచ్చిలో ప్రారంభమైంది. జోజు, ఇతర నటినటులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రం సఫర్ సనల్ దర్శకత్వంలో తొలిసారి రూపొందుతోంది. ఆయనే కథ కూడా రాశారు. స్క్రీన్ప్లే డైలాగ్స్ జోజు, రమేష్ గిరిజ, సఫర్ సనల్ కలిసి రాశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. సఫర్, రమేష్ గతంలో జోజు నటించిన చిత్రం 'పీస్' స్క్రీన్ప్లేను కలిసి రాశారు. అలాగే, రమేష్ జోజు దర్శకత్వంలో వచ్చిన 'పని' చిత్రంలో కీలక పాత్రలో నటించారు.
'ఆశ' సినిమా బహుభాషల్లో విడుదల కానుంది. వినాయక అజిత్ నిర్మిస్తున్నారు. విజయరాఘవన్, రమేష్ గిరిజ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. జోజు రాబోయే చిత్రాల్లో జీతు జోసెఫ్ దర్శకత్వంలో బిజు మీనన్తో కలిసి నటించే థ్రిల్లర్ 'వలదు వశత్తే కళ్ళన్' ఉంది. అలాగే, 'పని' చిత్రాన్ని ట్రయాలజీగా విస్తరించే ప్రణాళికను జోజు ప్రకటించారు. దాని రెండో భాగం డిసెంబర్లో ప్రారంభం కానుంది. ఊర్వశి ఇటీవల దిలీప్ నటించిన 'ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ'లో క్యామియోలో కనిపించారు. ఆమె తన కుమార్తె తేజ లక్ష్మితో కలిసి మొదటిసారి నటించే మలయాళం-తమిళ ద్విభాషా చిత్రం 'పాబ్లో పార్టీ' కూడా రాబోతోంది.