కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ దీపావళి వార్?
కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ దీపావళి వార్?ఈ దీపావళికి కోలీవుడ్ స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తి మధ్య ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ జరగబోతోందన్న ఊహాగానాలు ఫిలింనగరంలో హీట్ పెంచుతున్నాయి. ఇటీవలే ఇద్దరూ ఒకే రోజున విడుదలైన సినిమాల్లో కనిపించారు — సూర్య "రెట్రో" సినిమాలో నటించగా, కార్తి టాలీవుడ్ హీరో నానితో చేసిన "హిట్ 3"లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి మాత్రం ఇది నిజమైన క్లాష్ కావొచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం సూర్య, ఆర్జే బాలాజీ దర్శకత్వంలో "సూర్య 45" సినిమా తో బిజీ గా ఉన్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం దీపావళి సీజన్కు ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే ఉద్దేశంతో టీం ప్లాన్ చేస్తోంది.
ఇదే సమయంలో కార్తి నటిస్తున్న "సర్దార్ 2" చిత్రాన్ని కూడా దీపావళి సందర్భంగా విడుదల చేయాలన్న యోచనలో ఉన్నారు. ఈ సినిమాకు పి.ఎస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ మరియు ఐవై ఎంటర్టైన్మెంట్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే, ఇరువురు అన్నదమ్ముల సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే ఎవరిది పై చేయి అవుతుంది? అనే ఉత్కంఠ మాత్రం ప్రేక్షకుల మధ్య మొదలైంది. కొంతమంది ఫ్యాన్స్ ఈ ఫేస్ఆఫ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, మరికొంతమంది ఇది అన్నదమ్ములకు నష్టం కలిగించవచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
సరిగ్గా విడుదల తేదీలను చిత్రబృందాలు అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ దీపావళి కోలీవుడ్ అభిమానులకి మరపురాని అనుభవంగా మిగిలే అవకాశాలు ఉన్నాయి. వేచి చూద్దాం.. ఈసారి దీపావళికి నిజంగానే బిగ్ వార్ జరుగుతుందేమో.