‘సితారే జమీన్ పర్’ థియేటర్స్ లోనే విడుదలవుతుంది : ఆమిర్ ఖాన్

ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడం లేదని, మంచి సినిమాలను థియేటర్లలోనే చూడాలని, అప్పుడే ప్రేక్షకులకు నిజమైన సినిమా అనుభవం లభిస్తుందని అన్నారు.;

By :  K R K
Update: 2025-06-09 07:51 GMT

బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్ ఖాన్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘సితారే జమీన్ పర్’ గురించి వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన సూపర్ హిట్ చిత్రం ‘తారే జమీన్ పర్’ సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేస్తూ.. ఈ సినిమాను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేయడం లేదని, మంచి సినిమాలను థియేటర్లలోనే చూడాలని, అప్పుడే ప్రేక్షకులకు నిజమైన సినిమా అనుభవం లభిస్తుందని అన్నారు.

ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ... ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల వృద్ధి వల్ల థియేటర్లలో సినిమా చూసే సంస్కృతికి హాని కలుగుతోందని అన్నారు. సినిమాలను త్వరగా ఓటీటీలో విడుదల చేయడం వల్ల ప్రజలు థియేటర్లకు రావడం తగ్గిపోతోందని, ఇది సినిమా అనే వినోద సాధనానికి మంచిది కాదని చెప్పారు. నేను ఏ వ్యాపారంలోనూ ఇలాంటి విధానం చూడలేదు. ప్రస్తుతం పరిస్థితి ఏమిటంటే, కొన్ని సినిమాలు భారీ విజయం సాధిస్తాయి లేదా చాలా వరకు పూర్తిగా విఫలమవుతాయని, ఓటీటీలో త్వరగా విడుదల చేయడం థియేటర్ సంస్కృతిని బలహీనపరుస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అందుకే తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ ను కేవలం థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. "నాకు థియేటర్లపై నమ్మకం ఉంది. నా ప్రేక్షకులపై నమ్మకం ఉంది. మీరు మంచి సినిమా తీస్తే, ప్రజలు ఖచ్చితంగా పెద్ద తెరపై చూడటానికి వస్తారు," అని ఆయన అన్నారు. ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత చాలామంది తనకు యాక్షన్ సినిమా చేయమని సూచించినప్పటికీ, సితారే జమీన్ పర్ కథ తనను లోతుగా కదిలించిందని, ఇలాంటి కథలు తన రక్తంలో ఇమిడిపోతే వాటిని విస్మరించలేనని చెప్పారు. లగాన్, తారే జమీన్ పర్, దంగల్ వంటి సినిమాల విషయంలోనూ ఇదే జరిగిందని ఆయన తెలిపారు.

Tags:    

Similar News