'బాహుబలి' రీ-రిలీజ్.. ఒక కొత్త ప్రయోగం!

Update: 2025-06-06 08:30 GMT

తెలుగు సినిమాను గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. రాజమౌళి–ప్రభాస్ కలయికలో వచ్చిన ఈ ఎపిక్ ఫ్రాంచైజ్ లోని రెండు భాగాలు 'ది బిగినింగ్' (2015), 'ది కన్‌క్లూజన్' (2017) ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసాయి. ఈ సినిమాలు భారతీయ సినిమాకు కొత్త రూట్ చూపించి, వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించాయి.

ఇప్పుడు మళ్లీ అదే బాహుబలి వెండితెరపైకి తిరిగి రాబోతుంది. ఇప్పటివరకు పలు హిట్ సినిమాలు రీ-రిలీజ్ కావడం చూశాం. అయితే అవన్నీ ఒకే ఒక భాగాలున్న సినిమాలు. కానీ బాహుబలి విషయంలో మాత్రం మేకర్స్ ఓ మైలురాయిగా నిలిచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. 5.5 గంటల నిడివి గల రెండు భాగాలను మూడున్నర గంటలకు కుదించి, ఆసక్తికరమైన ఎపిసోడ్స్ మాత్రమే ఉండేలా కొత్త ఎడిట్ వెర్షన్ ను రూపొందిస్తున్నారు. అంటే ఇది రీ-రిలీజ్ కాదు.. ఒక రీ-ఎడిటెడ్ వెర్షన్ అన్నమాట.

ఈ ప్రత్యేక ఎడిషన్ లో ఎలాంటి సీన్స్ మిస్ కాకుండా, క్లైమాక్స్ నుంచి ఫ్లాష్‌బ్యాక్ వరకు స్పష్టతగా నెరేషన్ ఉండేలా రాజమౌళి టీం జాగ్రత్తలు తీసుకుంటోందట. ఓ విధంగా చెప్పాలంటే, ఇది బాహుబలి కథని మరింత షార్ట్ ఫార్మాట్ లో కొత్త తరానికి పరిచయం చేసే ప్రయత్నంగా చెప్పొచ్చు.

బాహుబలి ఫ్రాంచైజ్ ఇప్పటికీ అత్యధిక వసూళ్లు చేసిన ఇండియన్ మూవీ సిరీస్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాల వసూళ్లు దాదాపు రూ.2,500 కోట్లు. ఇప్పుడు మళ్లీ సరికొత్తగా థియేటర్లలో అడుగుపెట్టబోతున్న బాహుబలి సరికొత్త వెర్షన్ తో ఎలాంటి వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

Tags:    

Similar News