ఆ హీరోలు.. ఆ సినిమాలను మర్చిపోయారా?
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో తెలంగాణకు సంబంధించిన హీరోలు, కథాంశాలతో వచ్చిన సినిమాలకు అవార్డులు రాలేదనే విమర్శలు వస్తున్నాయి. హీరోల విషయానికొస్తే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన సిద్ధు జొన్నలగడ్డ, నితిన్ నటించిన చిత్రాలేవీ గద్దర్ అవార్డుల్లో స్థానం సంపాదించుకోలేకపోయాయి.
సిద్ధు జొన్నలగడ్డను స్టార్ బాయ్ గా నిలిపిన సిరీస్ ‘టిల్లు‘. ‘డీజె టిల్లు, టిల్లు స్క్వేర్‘ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిపించాడు సిద్ధు జొన్నలగడ్డ. వీటిలో ‘టిల్లు స్క్వేర్‘ అయితే వంద కోట్ల క్లబ్ లో సైతం చేరింది. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ నటన, పాటలు యూత్ ను ఓ ఊపు ఊపేశాయి. అంతలా కల్ట్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ‘టిల్లు‘ సిరీస్ కు అవార్డులు వస్తాయని ఆశించారు ఫ్యాన్స్.
అలాగే మరో తెలంగాణ హీరో నితిన్ నటించిన ‘అ..ఆ, శ్రీనివాస కళ్యాణం, భీష్మ‘ వంటి చిత్రాలు ఈ పదేళ్లలో విడుదలయ్యాయి. వీటిలో ‘అ..ఆ, భీష్మ‘ చిత్రాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. నితిన్ కి కూడా గద్దర్ అవార్డుల్లో స్థానం దక్కలేదు.
మరోవైపు నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా‘ చిత్రం ఇప్పటికే ఎన్నో వేదికలపై అవార్డుల పంట పండించింది. ఆద్యంతం తెలంగాణ నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. అలాంటి ‘దసరా‘కి కూడా గద్దర్ అవార్డుల్లో స్థానం లభించలేదు.