బాలకృష్ణతో నిర్మాతలు కీలక భేటీ

టాలీవుడ్‌ పరిశ్రమలో ఇటీవల సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం చర్చనీయాంశంగా మారింది. కార్మికులు తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, గత మూడు రోజులుగా షూటింగ్‌లను బహిష్కరిస్తున్నారు.;

By :  S D R
Update: 2025-08-07 00:53 GMT

టాలీవుడ్‌ పరిశ్రమలో ఇటీవల సినీ కార్మికుల వేతనాల పెంపు అంశం చర్చనీయాంశంగా మారింది. కార్మికులు తమ వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ, గత మూడు రోజులుగా షూటింగ్‌లను బహిష్కరిస్తున్నారు. మొత్తం 24 విభాగాల కార్మికులు ఈ సమ్మెలో భాగంగా ఉన్నారు. అయితే, ఈ డిమాండ్లను నిర్మాతల మండలి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇతర భాషలతో పోలిస్తే ఇప్పటికే తెలుగు కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని వారు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలోనే, టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణతో పలువురు ప్రముఖ నిర్మాతలు భేటీ అయ్యారు. పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల్ని వివరించారు. నిర్మాతల అభిప్రాయాలను విన్న బాలకృష్ణ, పరిశ్రమ సంక్షేమం కోసం తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. 'నిర్మాతలు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. అవసరమైన చోట మాత్రమే కార్మికులను నియమించాలి. పని రోజులు తగ్గిస్తే ఖర్చులు తగ్గుతాయి. నేను కూడా ఏడాదికి నాలుగు సినిమాల్లో నటించేందుకు సిద్ధం' అని పేర్కొన్నారు.

ఇక ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నేతలు కూడా అత్యవసరంగా సమావేశమై, నిర్మాతల ప్రతిపాదించిన నాలుగు కీలక మార్పులపై చర్చించారు. కాల్‌షీట్ మార్పులు, నాన్‌మెంబర్లను తీసుకోవడం, ఆదివారం వర్క్, ఫైటర్స్ - డ్యాన్సర్ల రేషియో వంటి అంశాలపై ఫిల్మ్‌ ఛాంబర్‌తో చర్చించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే రంగంలోకి దిగారు. నిర్మాతలతో చర్చించి, మూడు రోజుల్లో సమస్య పరిష్కరించుకునేలా సూచించారు.

Tags:    

Similar News