రాజమౌళితో స్టోరీ డిస్కషన్ కోసం ప్రియాంకా చోప్రా ?
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయ నటీమణి ప్రియాంక చోప్రా. అమెరికాలో కూడా అత్యంత ప్రసిద్ధి పొందిన కొద్ది మంది భారతీయ నటీమణుల్లో ఒకరామె. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ బ్యూటీని సూపర్ స్టార్ మహేశ్ బాబుకు జోడీగా తమ గ్లోబ్అట్రోటింగ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీలో తీసుకోవాలని ప్రయత్నిస్తురని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యస్ యస్ యమ్ బీ 29 ఈ ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతూ ప్రియాంక చోప్రా లేటెస్ట్ గా హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో ప్రియాంక చోప్రాను మీడియా కెమెరాలు క్లిక్ చేశాయి. ప్రియాంక చోప్రా లాస్ ఏంజెలెస్ నుంచి హైదరాబాద్కి ప్రత్యేకంగా ఎస్.ఎస్. రాజమౌళిని కలుసుకుని, ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించేందుకు వచ్చినట్లు సమాచారం. మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటించనున్న ఈ అడ్వెంచర్ డ్రామాలో ఆమె కథానాయికగా నటించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇంతకుముందు ఈ సినిమా కథానాయికగా ఇండోనేషియన్ నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ పేరు వినిపించింది. కానీ, ఇప్పటివరకు ఆ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. నవరి 2న హైదరాబాద్లో ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమం నిర్వహించారు. అయితే, రాజమౌళి బృందం ఈ ప్రారంభోత్సవం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే నటీనటుల వివరాలను కూడా ఇంకా బయటపెట్టలేదు.