త్రివిక్రమ్ సినిమాలపై నాగవంశీ క్లారిటీ!
మహేష్ బాబుతో ‘గుంటూరు కారం‘ రిలీజ్ చేసిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు.;
మహేష్ బాబుతో ‘గుంటూరు కారం‘ రిలీజ్ చేసిన తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరే కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కించలేదు. మహేష్ మూవీ తర్వాత వెంటనే అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సి ఉంది. అందుకోసం కొన్ని నెలలపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేశాడు గురూజీ. కానీ.. చివరకు ఆ ప్రాజెక్ట్ చేతులు మారింది. అల్లు అర్జున్ చేయాల్సిన మైథలాజికల్ మూవీ ఎన్టీఆర్ చెంతకు చేరింది.
మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రామ్ చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నాడని, అలాగే వెంకటేష్-చరణ్ కలయికలో మల్టీస్టారర్ రాబోతుందనే న్యూస్ ఇటీవల సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిన్నంటిపైనా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. త్రివిక్రమ్ కిట్టీలో ప్రెజెంట్ రెండు సినిమాలున్నాయని.. వాటిలో ఒకటి వెంకటేష్ తో కాగా, మరొకటి ఎన్టీఆర్ తో అని ట్విట్టర్ లో తెలిపారు నాగవంశీ. అలాగే త్రివిక్రమ్ కు సంబంధించి సినిమాల విషయంలో తానే అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు నాగవంశీ.
ఇక ముందుగా వెంకటేష్ తో త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తోంది. ఈ సినిమాని వచ్చే యేడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేయబోయే పౌరాణిక చిత్రాన్ని పట్టాలెక్కిస్తాడట మాటల మాంత్రికుడు.