రేపు రాబోతున్న చిత్రాలు!
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ముగ్గురు యువ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న భారీ మల్టీస్టారర్ 'భైరవం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.;
టాలీవుడ్లో చాలా రోజుల తర్వాత ముగ్గురు యువ హీరోలు కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న భారీ మల్టీస్టారర్ 'భైరవం'. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ డ్రామా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘నాంది, ఉగ్రం‘ వంటి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్స్ అందించిన విజయ్ కనకమేడల ఈసారి తమిళ చిత్రం 'గరుడన్' రీమేక్ గా 'భైరవం'ని తెరకెక్కించాడు. అయినా.. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ‘భైరవం‘లో చాలానే మార్పులు చేశాడు.
ఇప్పటికే 'భైరవం' నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ దక్కింది. హీరోలు ముగ్గురుకీ 'భైరవం' మంచి కమ్ బ్యాక్ మూవీ అవుతుందనే అంచనాలు పెరిగాయి. ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, అజయ్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కెకె. రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
రేపు విడుదలవుతోన్న మరో తెలుగు చిత్రం 'షష్టిపూర్తి'. ఈ చిత్రంలో రూపేష్ కథానాయకుడిగా నటించగా ఆకాంక్ష సింగ్ కథానాయికగా నటించింది. పవన్ ప్రభ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, అర్చన కీలక పాత్రలు పోషించారు. విశేషమేంటంటే క్లాసిక్ కామెడీ ‘లేడీస్ టైలర్’లో రాజేంద్రప్రసాద్, అర్చన జంటగా నటించారు. మళ్లీ వీరిద్దరి కలయికలో 39 సంవత్సరాల విరామం తరువాత వస్తోన్న మూవీ ఇది. 'లేడీస్ టైలర్'కి సంగీతాన్ని సమకూర్చిన మ్యాస్ట్రో ఇళయరాజా ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం మరో విశేషం.