ముఖ్యమంత్రితో భేటీ కానున్న సినీ ప్రముఖులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు, సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు.;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం చర్చించేందుకు, సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఈ నెల 15వ తేదీ (ఆదివారం) సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఉండవల్లి నివాసంలో జరగనుంది. ఈ కార్యక్రమం డిప్యూటీ సీఎం మరియు సినీ నటుడు పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతోంది. ఈ సమావేశంలో దాదాపు 30 మంది తెలుగు సినిమా రంగానికి చెందిన కీలక వ్యక్తులు పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
తెలుగు సినిమా రంగంలోని వ్యక్తులు కేవలం తమ సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారని, కానీ పరిశ్రమ అభివృద్ధి కోసం సమిష్టిగా చర్చలు జరపడం లేదని ఎ.పి. డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సమావేశం తెలుగు సినీ పరిశ్రమకు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించేందుకు ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు.
మరోవైపు తెలుగు సినిమా పరిశ్రమ, ఇటీవలి కాలంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. టికెట్ ధరల పెంపు, థియేటర్ల నిర్వహణ, ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ, మల్టీప్లెక్స్ల ఆధిపత్యం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ వంటి అంశాలు ఈ భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తోంది.