పెళ్లి పీటలెక్కబోతున్న నివేదా
హీరోయిన్ నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తీపి కబురు అభిమానులతో పంచుకుంది. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించింది.;
హీరోయిన్ నివేదా పేతురాజ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన తీపి కబురు అభిమానులతో పంచుకుంది. త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ఆమె అధికారికంగా ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, తనకు కాబోయే భర్త రాజ్హిత్ ఇబ్రాన్ను పరిచయం చేసింది. ఇప్పటికే తమ నిశ్చితార్థం కూడా జరిగిపోయిందని ఆమె పరోక్షంగా తెలిపింది.
దుబాయ్కు చెందిన వ్యాపారవేత్త అయిన రాజ్హిత్తో నివేదా చాలా కాలంగా ప్రేమలో ఉంది. 'ఇప్పటినుంచి జీవితమంతా ప్రేమమయమే..' అనే క్యాప్షన్తో ప్రియుడితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. వాటికి లవ్ ఎమోజీలు, రింగ్ సింబల్ జోడించడం ద్వారా ఈ శుభవార్తను అధికారికం చేశారు. వీరి పెళ్లి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహ వేడుక నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి తేదీకి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
తమిళనాడుకు చెందిన నివేదా పేతురాజ్ 2016లో ‘ఒరు నాళ్ కూతు’ సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమయ్యింది. తెలుగులో ‘మెంటల్ మదిలో’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 'చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురములో, రెడ్, ధమ్కీ' వంటి చిత్రాలలో నటించింది.