‘భైరవం‘ మూవీ రివ్యూ
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవం’. కె కె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భైరవం‘ సినిమా ఎలా ఉందో?ఈ రివ్యూలో చూద్దాం.;
నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్, అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై, జయసుధ, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్
నిర్మాత: KK రాధామోహన్
దర్శకత్వం: విజయ్ కనకమేడల
విడుదల తేది: మే 30, 2025
బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ప్రధాన పాత్రల్లో విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భైరవం’. కె కె రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు (మే 30) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భైరవం‘ సినిమా ఎలా ఉందో?ఈ రివ్యూలో చూద్దాం.
కథ
తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపురం అనే చిన్న గ్రామంలో గల వారాహి అమ్మవారి ఆలయం అనేది స్థానికుల విశ్వాసానికి కేంద్రబిందువుగా నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని ట్రస్టీగా నిర్వహించే నాగరత్నమ్మ (జయసుధ) ఒక గౌరవనీయురాలిగా గ్రామంలో పేరు సంపాదించుకుంటుంది. ఆమె మనవడు గజపతి వర్మ (మంచు మనోజ్), వంశపారంపర్యంగా ఆలయ పనులను చూసుకుంటాడు. అతని స్నేహితుడు వరద (నారా రోహిత్) కూడా అతనితో కలిసి మెలిసి ఆలయ వ్యవహారాల్లో అండగా ఉంటాడు. గజపతికి నమ్మిన బంటు శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్).
ఈలోగా పవిత్ర దేవస్థానం భూములపై కన్నేస్తాడు మంత్రి విదురపల్లి (శరత్ లోహితశ్వ). వెయ్యి కోట్ల విలువ గల ఆలయ భూములను ఆక్రమించేందుకు కుట్రలు పన్నడం ప్రారంభిస్తాడు. ఈ పనికి నాగరాజు (అజయ్) భాగస్వామ్యమవుతున్నాడు. భూముల స్కాంలోకి సీఐ పార్థసారథిని (సంపత్) లాగేస్తారు.
ఈ కుట్రలు గజపతి, వరద మధ్య భిన్నాభిప్రాయాలకు దారితీస్తాయి. ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. వారిద్దరి మధ్య బంధం బలహీనమవుతుంది. ఈ సమయంలో గజపతి భార్య నీలిమ (ఆనంది), వరద భార్య పూర్ణిమ (దివ్యా పిళ్లై) పాత్రలు ప్రధానంగా మారతాయి. ఈ కథలో శ్రీనుని ప్రేమించే వెన్నెల (అదితీ శంకర్) పాత్రేమిటి? చివరికి నమ్మిన బంటుగా శ్రీను ఎవరి వైపు నిలుస్తాడు? అనేది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
విజయ్ కనకమేడల తెరకెక్కించిన ‘భైరవం‘ సినిమా తమిళ చిత్రం ‘గరుడన్‘కి రీమేక్. సూరి, శశికుమార్, ఉన్ని ముకుందన్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఆ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీను, నారా రోహిత్, మనోజ్లతో రీమేక్ చేశారు.
అయితే ఒరిజినల్ తో పోలిస్తే తెలుగులోని పాత్రల షేడ్స్, ట్రీట్మెంట్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని విజయ్ కనకమేడల మాస్ యాక్షన్ సీక్వెన్స్లు, ఫైట్లు, పాటలు, హీరోల ఎంట్రీలను భారీగా డిజైన్ చేశాడు.
బెల్లంకొండ శ్రీను పాత్రలోనూ చాలా మార్పులు చేశారు. తమిళంలో సూరి పాత్ర తన యజమానికి అంకితభావంతో ఉంటుంది. కానీ ఇక్కడ పాత్ర తటస్థంగా, ఇద్దరినీ బ్యాలెన్స్ చేసినట్లు చూపారు. ఉన్ని ముకుందన్ పోషించిన విలన్ పాత్రకు తమిళంలో గాఢత ఎక్కువగా ఉన్నప్పటికీ, మనోజ్ పాత్రను మాత్రం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తక్కువ విలనిజంతో చూపించారు.
కథాపరంగా పెద్దగా మార్పులు లేకపోయినా, ప్రెజెంటేషన్ పరంగా మాత్రం అనేక తేడాలు కనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగుతుంది. ఇంటర్వెల్, క్లైమాక్స్లోని యాక్షన్ బ్లాక్స్ సినిమాకు హైలైట్. ఇటుక బట్టీలో వచ్చే సీన్ బాగుంది. అయితే.. కథ కొత్తగా ఏమీ అనిపించకపోయినా, రోహిత్, మనోజ్, బెల్లంకొండ శ్రీను నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సన్నివేశాల్లో తనదైన ముద్ర వేశాడు. సెకండాఫ్ లో అతని ఫైట్స్, భావోద్వేగ నటన ఆకట్టుకుంటాయి. గజపతి పాత్రలో మంచు మనోజ్ తనదైన నటనతో, బేస్ వాయిస్, డైలాగ్ డెలివరీతో మెప్పించాడు. లాంగ్ గ్యాప్ తర్వాత రీ-ఎంట్రీలో ఈ పాత్ర అతనికి బాగా కలిసొచ్చింది. నారా రోహిత్ ఎమోషనల్ డెప్త్ ఉన్న పాత్రలో చక్కగా నటించాడు. రోహిత్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఇంకా ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది, జయసుధ, అజయ్, సంపత్, శరత్ లోహితశ్వ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
కె.కె. రాధామోహన్ ఎక్కడా రాజీపడకుండా గ్రాండ్గా ఈ చిత్రాన్ని నిర్మించారు. శ్రీ చరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. పాటలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆర్ట్ డైరెక్షన్, సినిమాటోగ్రఫీ చక్కగా కుదిరాయి.
చివరగా
దర్శకుడు విజయ్ కనకమేడల ‘భైరవం‘ రూపంలో ఓ మాస్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. బి,సి సెంటర్స్ కి పండగ లాంటి సినిమా ఇది. ఇంటర్వెల్ కి ముందు పది నిముషాలు, క్లైమాక్స్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇరగదీశాడు. నారా రోహిత్, మంచు మనోజ్ తమ కెరీర్ బెస్ట్ యాక్టింగ్ చేశారు. మొత్తంగా ‘భైరవం‘ పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అని చెప్పాలి.
Telugu 70mm Rating: 3/5