డ్వాక్రా మహిళల కోసం సిల్క్ డెవలప్మెంట్, కామన్ ఫెసిలిటీ సెంటర్లు
మహిళల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైంది,డ్వాక్రా సంఘాలు చంద్రబాబు మానస పుత్రికలు;
డ్వాక్రా సంఘాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మానస పుత్రికలు అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. విజయవాడలో జరిగిన ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, డ్వాక్రా మహిళల అభివృద్ధి జరిగితే ప్రతి ఇంట్లో ఓ వ్యాపారవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి ఆశయం త్వరగా నెరవేరుతుంది అన్నారు.
విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాల్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) ఆధ్వర్యంలో స్లం సమాఖ్య రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లు పంపిణీ కార్యక్రమం ఐ.వి. ప్యాలెస్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రూ. 35 వేల విలువైన ట్యాబ్లు 500 మంది ఆర్.పిలకు అందించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని మాట్లాడుతూ, డ్వాక్రా సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్న ఆర్.పిల సేవలు అభినందనీయమైనవి అని. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిజిటలైజేషన్పై దృష్టి సారించి, అన్ని ప్రభుత్వ పనులను వేగంగా, పారదర్శకంగా పూర్తిచేయడానికి మార్పులు తీసుకువస్తున్నారు అని చెప్పారు కేశనేని.
డ్వాక్రా మహిళలు తమ నైపుణ్యాన్ని ఉపయోగించి సిల్క్ డెవలప్మెంట్ సెంటర్లు, కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటుచేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా పచ్చళ్లు, ఇతర హోం మేడ్ ఫుడ్ తయారీలో నైపుణ్యం ఉన్న మహిళలు, ప్యాకింగ్, మార్కెటింగ్ సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని కామన్ ఫెసిలిటీ సెంటర్ ద్వారా ప్యాకింగ్, ఉచితంగా మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నామని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగా ఉన్న మహిళలకు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా అండగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయం అని తెలియచేసారు. ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్నదే ఆయన లక్ష్యం,అని బొండా ఉమా తెలిపారు.