మరో రెండు ప్రాజెక్టులు అనౌన్స్ చేసిన ‘కుబేర’ నిర్మాత
కుబేర నిర్మాత సునీల్ నారంగ ఈ మూవీ కాకుండా మరో రెండు సినిమాల్ని ప్రకటించారు. వీటిలో ఒకటి శేఖర్ కమ్ములతో అయితే మరొకటి 96 ఫేమ్ ప్రేమ్ కుమార్ తో అవడం విశేషం.;
‘కుబేరా’ చిత్రం ఈ ఏడాది అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. జూన్ 20, 2025న విడుదల కానున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దీనికి దర్శకుడు.
తాజా అప్డేట్లో... ఈ చిత్ర నిర్మాత సునీల్ నారంగ్ మరో రెండు కొత్త ప్రాజెక్టులను ప్రకటించారు. మొదటగా... శేఖర్ కమ్ములతో మరోసారి కలిసి కొత్త సినిమా తీయనున్నట్లు ధ్రువీకరించారు. ఈ కాంబోకి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ ప్రకటన అభిమానుల్లో ఇప్పటికే ఉత్సాహాన్ని రేకెత్తించింది.
అలాగే, సునీల్ నారంగ్ మరో ప్రాజెక్ట్ను దర్శకుడు ప్రేమ్ కుమార్తో కలిసి చేయనున్నట్లు తెలిపారు. ప్రేమ్ కుమార్ ’96’ (తెలుగులో జాను), ’మెయ్యళగన్’ (సత్యం సుందరం) వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేనప్పటికీ, త్వరలో మరిన్ని వివరాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నారు. ‘కుబేరా’ చిత్రం విడుదలకు దగ్గరవుతున్న ఈ టైమ్ లో సునీల్ నారంగ మరో రెండు ప్రాకెక్టుల్ని అనౌన్స్ చేయడం విశేషంగా మారింది.