భారీ ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ‘పెద్ది’
భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే చరణ్ కెరీర్లోనే అత్యధిక ధరకు ఆడియో హక్కులు విక్రయించబడ్డాయి.;
గ్లోబల్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న "పెద్ది" సినిమా తొలి షాట్తోనే పాన్ ఇండియా రికార్డు బద్దలు కొట్టింది. గ్రామీణ క్రీడల నేపథ్యంతో రూపొందుతున్న ఈ విజువల్ స్పెక్టకల్ స్పోర్ట్స్ డ్రామాలో చివరి క్రికెట్ షాట్ భారీగా వైరల్ అవుతూ.. సోషల్ మీడియాలో రీల్స్గా తిరుగులేకుండా మారిపోయింది. ఐపీఎల్ సీజన్ సమయంలో దీన్ని విడుదల చేయడం చిత్రబృందం తీసుకున్న మాస్టర్స్ట్రోక్ అనే చెప్పాలి.
నిర్మాణ బాధ్యతలు చేపట్టిన వెంకట సతీష్ కిలారు.. భారత సినీ చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈ చిత్రాన్ని భారీగా ప్రెజెంట్ చేస్తూ ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. దర్శకుడు బుచ్చి బాబు సానా తీసిన టేకింగ్ కి ఎక్కడ చూసినా ప్రశంసలే వినిపిస్తున్నాయి. రామ్చరణ్ను గ్రామీణ బ్యాక్డ్రాప్లో మాస్ లుక్లో ప్రెజెంట్ చేసిన తీరు సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
చరణ్ స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ అద్భుతమైన స్పందనను అందుకున్నాయి. ఈ ఊహించని హైప్లో మేకర్స్కి భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ హక్కుల కోసం భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే చరణ్ కెరీర్లోనే అత్యధిక ధరకు ఆడియో హక్కులు విక్రయించబడ్డాయి. ప్రస్తుతం సినిమా మార్కెట్లో నిశ్శబ్దం నెలకొన్న వేళ ఈ స్థాయిలో ఆసక్తి చూపించడమంటే మామూలు విషయం కాదు. అయినా, బృందం తొందరపడకుండా, సరైన సమయంలో అధికారిక ప్రకటనలు చేయాలని భావిస్తోంది.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. ఈ చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లో వేసవికి ఓపెనింగ్గా విడుదల కానుంది.