‘బార్డర్ 2’ షూటింగ్ ప్రారంభించిన సన్నీ డియోల్
ఇండియన్ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన దేశభక్తి యుద్ధ చిత్రం బార్డర్. ఈ మూవీకి కొనసాగింపుగా రానున్న ‘బార్డర్ 2’ చిత్రీకరణను మెయిన్ హీరో సన్నీ డియోల్ ప్రారంభించారు. తాజాగా ఆయన తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ సినిమా సెట్స్లో తీసుకున్న ఒక ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో సన్నీ డియోల్తో పాటు యంగ్ హీరో వరుణ్ ధవన్ కూడా ఉన్నాడు. అతడు ఈ చిత్రంలో సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు.
ఈ ఫోటోలో చిత్ర దర్శకుడు అనురాగ్ సింగ్, నిర్మాతలు భూషణ్ కుమార్, నిధి దత్త, సహనిర్మాతలు శివ్ చనానా, బినోయ్ గాంధీ కూడా ఉన్నారు. 1997లో జేపీ దత్త దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్బస్టర్ ‘బార్డర్’ చిత్రానికి ఇది సీక్వెల్గా రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో పాటు అహాన్ శెట్టి, దిల్జిత్ దోసాంజ్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఇప్పటివరకు భారతదేశంలో వచ్చిన అతిపెద్ద యుద్ధ చిత్రం కావచ్చని చిత్రబృందం అంటోంది.
సన్నీ డియోల్ ఇందులో ఏ విధమైన పాత్ర పోషిస్తున్నారన్న విషయం గుట్టుగానే ఉంచారు. అయితే, గతంలో గదర్ ఫ్రాంచైజీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లినట్లుగానే, బార్డర్ సీక్వెల్తోనూ అలాంటి మేజిక్ చేయగలరా అనేదే అందరిలో ఆసక్తిని పెంచుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ మధ్యప్రదేశ్లోని ఝాన్సీ కన్టోన్మెంట్ ప్రాంతంలోని ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్స్లో జరుగుతోంది. సన్నీ డియోల్, వరుణ్ ధవన్ తమ భాగాన్ని ఇప్పటికే షూట్ చేయగా, దిల్జిత్ దోసాంజ్ ఇంకా టీమ్ను జాయిన్ కావాల్సి ఉంది. ఈ భారీ యుద్ధ చిత్రం రిపబ్లిక్ డే స్పెషల్గా 2026 జనవరి 23న థియేటర్లలో సందడి చేయనుంది.