బాలీవుడ్ లోకి మరో సౌత్ డైరెక్టర్ !

అజయ్ దేవ్‌గణ్ 'సు ఫ్రం సో' ఫేమ్ దర్శకుడు జెపి తుమినాడు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.;

By :  K R K
Update: 2025-08-22 01:26 GMT

ఇటీవల 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు అజయ్ దేవ్ గణ్. ఇప్పుడు అతడు కూడా దక్షిణాది దర్శకుడితో కలిసి పని చేయాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్. బాలీవుడ్ నటులు దక్షిణాది దర్శకులతో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో.. అజయ్ దేవ్‌గణ్ కూడా తన సినిమా రేంజ్‌ను విస్తరించాలని చూస్తున్నాడు. ముఖ్యంగా 'ఆర్ఆర్ఆర్'లో అతని నటనకు ఎన్నో ప్రశంసలు లభించిన నేపథ్యంలో.

తాజా సమాచారం ప్రకారం.. అజయ్ దేవ్‌గణ్ 'సు ఫ్రం సో' ఫేమ్ దర్శకుడు జెపి తుమినాడు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. కన్నడ హారర్ కామెడీ చిత్రం 'సు ఫ్రం సో' బాక్సాఫీస్ వద్ద భారీ హిట్‌గా నిలిచింది. తర్వాత దీన్ని తెలుగులో కూడా డబ్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్స్ తో టీమ్ సంతోషంగా ఉంది. ఆసక్తికరంగా, అజయ్ జెపితో కలిసి సినిమా చేయాలని భావిస్తున్నాడు. వారు ఇప్పటికే చర్చలు ప్రారంభించారు. వార్తల ప్రకారం, జెపి ఇప్పటికే అజయ్‌కు ఒక ఆలోచనను పిచ్ చేశాడు. అది అజయ్‌కు నచ్చింది.

ఇప్పుడు అజయ్ పూర్తి స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. స్క్రిప్ట్ అతన్ని ఆకట్టుకుంటే, ఈ సినిమా వెంటనే సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. నిర్మాతలు 2026 మొదటి భాగంలో షూటింగ్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కర్ణాటకకు చెందిన ఈ ప్రముఖ నిర్మాణ సంస్థ ఇప్పటికే హిందీలో రెండు సినిమాలను నిర్మిస్తోంది. ఒకటి అక్షయ్ కుమార్‌తో, మరొకటి సైఫ్ అలీ ఖాన్‌తో. ఈ బ్యానర్ హిందీ సినిమా రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టాలని భావిస్తోంది.

Tags:    

Similar News