గద్దర్ అవార్డులు.. సినీ ప్రముఖుల స్పందన!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ గా 'కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్' చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా 'పుష్ప 2'లోని నటనకు గానూ అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఉత్తమ నటిగా నివేదా థామస్ '35' సినిమాకి గానూ ఎంపికయ్యింది.;
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. 2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్స్ గా 'కల్కి, పొట్టేల్, లక్కీ భాస్కర్' చిత్రాలు ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా 'పుష్ప 2'లోని నటనకు గానూ అల్లు అర్జున్ ఎంపికయ్యాడు. ఉత్తమ నటిగా నివేదా థామస్ '35' సినిమాకి గానూ ఎంపికయ్యింది. ఇంకా.. 'కమిటీ కుర్రోళ్లు, రజాకార్, ఆయ్' వంటి సినిమాలకు వివిధ కేటగిరీల్లో అవార్డులు దక్కాయి.
'పుష్ప' రాజ్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే నేషనల్ అవార్డు అందుకున్నాడు. ఈ సిరీస్ లో వచ్చిన సెకండ్ పార్ట్ కి గానూ బన్నీకి బెస్ట్ యాక్టర్ గా గద్దర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘ఎక్స్’ వేదికగా హర్షం వ్యక్తం చేస్తూ, 'ఇది నా కోసం గౌరవంగా భావిస్తున్న అవార్డు. ఇది ఎంటైర్ పుష్ప టీమ్ కృషికి ఫలితం' అని తెలిపారు. దర్శకుడు సుకుమార్, నిర్మాతలు, టీమ్కు కృతజ్ఞతలు చెప్పిన బన్నీ, ఈ అవార్డును తన అభిమానులకు అంకితమిస్తున్నట్టు వెల్లడించాడు.
‘35 ఇది చిన్న కథ కాదు’ చిత్రంలో తన హృదయాన్ని తాకే నటనతో నివేదా బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డును దక్కించుకుంది. ఈ అవార్డు రావడం పట్ల నివేదా సోషల్ మీడియా వేదికగా తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది.
సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్ తో భారతీయ ఇతిహాసాలను ఆధారం చేసుకుని రూపొందించిన 'కల్కి 2898 ఎ.డి.'కి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తో పాటు.. బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తమ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
అనన్య నాగళ్ళ ప్రధాన పాత్రలో నటించిన 'పొట్టెల్' సినిమాకి సెకండ్ బెస్ట్ ఫిల్మ్ గా అవార్డ్ వరించింది. వెంకీ అట్లూరి తీసిన 'లక్కీ భాస్కర్' థర్డ్ బెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో రూపొందిన 'లక్కీ భాస్కర్ చిత్రానికి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా వెంకీ అట్లూరికి అవార్డ్ వరించింది. దుల్కర్ కి స్పెషల్ జ్యూరీ అవార్డు, నవీన్ నూలీకి బెస్ట్ ఎడిటర్ అవార్డ్స్ దక్కాయి. 'లక్కీ భాస్కర్' నాలుగు అవార్డులు రావడం పట్ల సితార ఎంటర్టైన్మెంట్స్ తమ ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది.
'సరిపోదా శనివారం' చిత్రంలోని అద్భుతమైన నటనకు ఎస్.జె.సూర్యకు ఉత్తమ సహాయ నటుడిగా గద్దర్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు సూర్య. మరోవైపు గద్దర్ అవార్డుల్లో నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ సత్తా చాటింది. ఈ చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ నేషనల్ ఇంటిగ్రేషన్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులు దక్కాయి.
మరోవైపు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గద్దర్ అవార్డుల విజేతలకు శుభాకాంక్షలు తెలిపాడు. తన చిత్రం 'దేవర'కు నృత్య దర్శకత్వం అందించిన గణేశ్ ఆచార్య బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు గెలుచుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపాడు. గద్దర్ అవార్డుల ద్వారా తెలుగు సినిమాను ప్రోత్సహించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని పేర్కొన్నాడు.