కేటీఆర్-సీఎం ముఖాముఖి చర్చపై హీట్ – సోమాజిగూడలో భారీ భద్రత

రైతుల సంక్షేమంపై ముఖాముఖి చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్తో రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.
ఇటీవల కేటీఆర్ – “ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ముఖాముఖి చర్చ చేద్దాం” అని ముఖ్యమంత్రికి ఓ సవాల్ విసిరారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ వెళ్లారు. దీన్ని సమర్థించని BRS నేతలు, కేటీఆర్ సవాలుతో భయపడి సీఎం ఢిల్లీకి పారిపోయారంటూ ఎద్దేవా చేశారు.
ఇదిలా ఉండగా, కేటీఆర్ కొద్ది సేపటి క్రితం తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ – “నేను ముందుగానే చెప్పినట్టు ప్రెస్ క్లబ్ కు వెళ్తున్నాను. ముఖ్యమంత్రి రాకపోతే, కనీసం మంత్రులైనా చర్చకు రావాలి” అంటూ స్పష్టం చేశారు.
ప్రస్తుతం కేటీఆర్ ప్రెస్ క్లబ్ కు పయనమవుతున్నారు. ఈ క్రమంలో BRS శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుంటుండగా, పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ప్రెస్ క్లబ్ గేటు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి, లోపలికి వెళ్లే వారిపై నిఘా ఉంచుతున్నారు పోలీస్ సిబ్బంది.
-
Home
-
Menu