హార్డ్డిస్క్ పై స్పందించిన విష్ణు!

మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’కి సంబంధించిన కీలకమైన వీఎఫ్ఎక్స్ ఫుటేజ్ ఉన్న హార్డ్డిస్క్ మాయమైన ఘటనపై ఆయన తొలిసారి స్పందించాడు. చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ, ఈ వ్యవహారాన్ని క్లారిటీగా వివరించాడు.
విష్ణు చెప్పిన వివరాల ప్రకారం, ముంబైలో కలర్ గ్రేడింగ్ పనుల కోసం సిద్ధం చేసిన 70 నిమిషాల వీఎఫ్ఎక్స్ ఫుటేజ్ను కొరియర్ ద్వారా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్కు పంపారు. అయితే, ఆ హార్డ్డ్రైవ్ గమ్యస్థానానికి చేరలేదు. ఇది ఫిల్మ్నగర్లోని మోహన్బాబు ఇంటికి చేరి, అక్కడ రఘు అనే వ్యక్తి తీసుకుని చరిత అనే అమ్మాయికి అందించాడని తెలిపాడు. వీరు తన సోదరుడు మంచు మనోజ్ ఇంట్లో పనిచేసే వారు కావచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. 'వాళ్లే చేశారా, లేక ఎవరో చెప్పి చేయించారా అన్నది నాకు తెలియదు' అని స్పష్టత ఇచ్చాడు.
విష్ణు తెలిపిన వివరాల ప్రకారం, మే 18న ‘ఎక్స్’లో ఓ పోస్ట్ ద్వారా ఈ విషయం తన దృష్టికి వచ్చింది. 'హార్డ్డ్రైవ్ మనోజ్ చేతిలో ఉంటే పరిస్థితి ఏంటి?' అనే సందేహం కలిగే విధంగా ఆ పోస్టు ఉన్నట్టు తెలిపాడు. తాను మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోలేదని, కానీ తన తండ్రి మోహన్బాబు బాధపడటంతో నిర్ణయం మార్చుకుని ఫిర్యాదు చేశానని చెప్పాడు.
అలాగే 'హార్డ్డ్రైవ్కు పాస్వర్డ్ ఉంది. 99 శాతం సురక్షితం, కానీ 1 శాతం అవకాశమే లీక్ అవ్వడానికి ఛాన్స్. ఒకవేళ లీక్ అయితే దయచేసి ఎవరూ ఆ ఫుటేజ్ను చూడవద్దు, షేర్ చేయవద్దు. ఎందుకంటే ఇది వందల మంది కష్టం' అని కోరాడు విష్ణు. ‘కన్నప్ప’ చిత్రం జూన్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
-
Home
-
Menu