సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నాగార్జున

అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్డ్జీ కుమార్తె జైనబ్తో అఖిల్ వివాహం జూన్ 6న జరగబోతుంది. గతేడాది నవంబర్ 26న ఈ జంట నిశ్చితార్థం చేసుకుంది. అప్పటినుంచి ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈరోజు (శనివారం) ఉదయం నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అఖిల్ వివాహ ఆహ్వాన పత్రికను సీఎంకు స్వయంగా అందజేశారు. సీఎం కూడా వారికి శుభాకాంక్షలు తెలిపారు. వివాహం హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించనున్నట్లు సమాచారం. అనంతరం రాజస్థాన్లో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు తెలిస్తోంది.
అఖిల్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ‘లెనిన్‘తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో అఖిల్ కి జోడీగా శ్రీలీల నటిస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే ‘లెనిన్‘ విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu