డ్రగ్స్ వద్దు బ్రో! గంజాయి, మత్తుపదార్థాలపై సీఎం చంద్రబాబు యుద్ధం

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గంజాయి, డ్రగ్స్ పై ఉగ్రంగా స్పందించారు. నిన్న గుంటూరులో జరిగిన "డ్రగ్స్ వద్దు బ్రో" ర్యాలీలో పాల్గొన్న సీఎం, విద్యార్థులతో కలిసి నడిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... గంజాయి విక్రయిస్తే ఆస్తుల జప్తే అని హెచ్చరించారు. డ్రగ్స్ వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపడతామని, టోల్ ఫ్రీ నంబర్ 1972, వాట్సప్ నంబర్ 8977781972ల ద్వారా సమాచారం అందించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించిన చంద్రబాబు, యువతను మత్తు నుంచి బయటకు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. విశాఖ కేంద్రంగా గంజాయి సాగును పూర్తిగా అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారంగా కఠిన చర్యలు చేపడతామన్నారు.
గంజాయి, డ్రగ్స్ బారిన పడితే యువత శారీరకంగా, మానసికంగా నిర్వీర్యమవుతుందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మత్తుపదార్థాలకు బానిసై వ్యక్తులు మానవ మృగాల్లా మారి పసికందుల పైనా దాడులు చేస్తుండటం దురదృష్టకరమన్నారు."ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది," అని సీఎం హెచ్చరించారు. 2047 నాటికి తెలుగు జాతి నెంబర్ వన్గా ఉండాలంటే గంజాయి, డ్రగ్స్ను సమూలంగా నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు."2047 నాటికి తెలుగు రాష్ట్రాలు నెంబర్ వన్ గా ఉండాలంటే... మత్తు నివారణే మొదటి అడుగు" అని సీఎం హితవు పలికారు.
-
Home
-
Menu