కోస్తాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక

కోస్తాంధ్రలో భారీ వర్షాల హెచ్చరిక
X
వచ్చే 48 గంటల్లో వాయువ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో వాతావరణ మార్పులు తీవ్రం - పశ్చిమ గోదావరి నుండి ప్రకాశం వరకు పలుచోట్ల భారీ వర్షాలు

బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రేపు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో బలపడే సూచనలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

దీని కారణంగా వచ్చే రెండు రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు, ప్రజలకు అలర్ట్ సందేశాలు పంపినట్లు ఆయన చెప్పారు. గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద, పాడుబడిన భవనాల దగ్గర, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

బుధవారం (13-08-2025) పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో అనేక చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, నంద్యాల జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు ఉండవచ్చు.

గురువారం (14-08-2025) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయి.

మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు ప్రకాశం జిల్లా మద్దిపాడులో 93 మిల్లీమీటర్లు, కాకినాడ జిల్లా కోటనందూరులో 76 మిల్లీమీటర్లు, సామర్లకోటలో 72.2 మిల్లీమీటర్లు, అల్లూరి జిల్లా కరిముక్కిపుట్టిలో 68 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో 59.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags

Next Story