మల్లి తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు..సీబీఐ నివేదిక అందించాలంటూ పిటిషన్

మల్లి తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు..సీబీఐ నివేదిక అందించాలంటూ పిటిషన్
X
సీబీఐ దర్యాప్తుపై అనుమానాలు ! ఆయేషా తల్లిదండ్రుల ఆవేదన

2007లో జరిగిన ఆయేషా మీరా హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీబీఐ దర్యాప్తు తుది నివేదికను తమకు అందించాలని కోరుతూ హతురాలి తల్లిదండ్రులు హైకోర్టులో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపించారు.

న్యాయవాది వాదనల ప్రకారం, సీబీఐ దాఖలు చేసిన తుది నివేదికను ఆయేషా మీరా తల్లిదండ్రులు పొందేందుకు అర్హులని, దాన్ని అందజేయాలని కోర్టు సీబీఐని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ, ఆ నివేదిక ఇప్పటికే సీబీఐ కోర్టులో ఉందని, అక్కడి నుంచే తీసుకోవచ్చని అభిప్రాయపడింది.

అయితే, తాము గత 18 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం పోరాడుతున్నామని, ఇప్పుడు మళ్లీ మరో కోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పిటిషనర్లు కోర్టుకు తెలియజేశారు.పిటిషనర్ పక్షం నుంచి మరో కీలక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆయేషా మీరా రీ-పోస్ట్‌మార్టం నివేదికలు ఇప్పటికీ తమకు అందలేదు అని పేర్కొన్నారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరగా, న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని గమనంలోకి తీసుకుంటూ విచారణను జులై 4వ తేదీకి వాయిదా వేశారు.

ఇటీవలి కాలంలో సీబీఐ తుది నివేదికను హైకోర్టుకు సమర్పించినప్పటికీ, తల్లిదండ్రులకు ఇప్పటివరకు అందజేయకపోవడం పట్ల వారి ఉత్కంఠ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం, తండ్రి ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడుతూ – సీబీఐ దర్యాప్తు పూర్తిగా విఫలమైంది అనే అనుమానం మాకు కలుగుతోంది. ఇప్పటి వరకూ మాకు ఒక్క నివేదిక కూడా ఇవ్వలేదు. ఇది న్యాయ వ్యవస్థపైనా, దర్యాప్తుపైనా మాకు అనిశ్చితిని కలిగిస్తోంది అని వ్యాఖ్యానించారు.

తమ కుమార్తెకు న్యాయం జరగాలంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కేసును పర్యవేక్షించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును ప్రత్యేక దృష్టితో సీఎం తీసుకుంటేనే మాకు న్యాయం జరగగలదు అని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags

Next Story