ఉత్తరాంధ్రలో మరో భారీ వర్షాల హెచ్చరిక

భారత వాతావరణ విభాగం(IMD) సూచనల ప్రకారం రేపు వాయువ్య బంగాళాఖాతంలో, ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ఆయన చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర తీరప్రాంతంలో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ దగ్గర ఉండకూడదని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటకూడదని సూచించారు.
రేపు(సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది.
మరుసటిరోజు (మంగళవారం)శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటు,కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడే అవకాశం ఉంది.
బుధవారం మాత్రం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని,మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు మాత్రమే పడతాయి అని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది.
-
Home
-
Menu