ఢిల్లీ–వాషింగ్టన్‌ ఫ్లైట్లను నిలిపివేసిన ఎయిర్ ఇండియా

ఢిల్లీ–వాషింగ్టన్‌ ఫ్లైట్లను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
X
బోయింగ్‌ 787-8 రీట్రోఫిట్‌, పాకిస్తాన్‌ గగన మార్గం మూసివేత ప్రధాన కారణాలు - ప్రయాణికులకు రీబుకింగ్‌ లేదా పూర్తి రీఫండ్‌ సదుపాయం

ఎయిర్ ఇండియా 2025 సెప్టెంబర్‌ 1 నుండి ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీకి నేరుగా నడిచే విమాన సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం పూర్తిగా ఆపరేషనల్‌ సవాళ్ల కారణంగా తీసుకున్నామని సంస్థ తెలిపింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానాలను ఆధునీకరించే (రీట్రోఫిట్) పనులు చేస్తోంది. ఈ పనుల వల్ల కొన్ని విమానాలు తాత్కాలికంగా సేవలో లేవు. అదనంగా, పాకిస్తాన్‌ గగనతల మార్గాలు మూసివేయబడటంతో, విమాన ప్రయాణ మార్గాలు పొడవు పెరిగి, సమయానికి ఫ్లైట్ నడపడం కష్టమవుతోంది. ఈ రెండు కారణాల కలయికతో రూట్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.

ఈ రూట్‌ కోసం ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారికి ఎయిర్ ఇండియా రెండు అవకాశాలు ఇస్తోంది ప్రత్యామ్నాయంగా మరో విమానంలో రీబుకింగ్ లేదా పూర్తి రీఫండ్‌. అలాగే, న్యూయార్క్‌, న్యూార్క్‌, చికాగో లేదా సాన్‌ఫ్రాన్సిస్కో ద్వారా ఒక స్టాప్ కనెక్షన్‌తో వాషింగ్టన్‌ చేరే ఏర్పాట్లు కూడా అందించనుంది.

వాషింగ్టన్‌ డీసీకి నేరుగా విమాన సర్వీసులు ఆగినా, టొరొంటో, వాంకూవర్ వంటి ఉత్తర అమెరికా నగరాలకు నేరుగా వెళ్లే ఎయిర్ ఇండియా సేవలు యథావిధిగా కొనసాగుతాయి. సంస్థ త్వరలో విమానాల రీట్రోఫిట్‌ పనులు పూర్తయ్యాక, మళ్లీ ఢిల్లీ–వాషింగ్టన్ రూట్‌ను పునఃప్రారంభించే అవకాశముందని సంస్థ తెలియచేసింది.

Tags

Next Story