టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల ప్రైవసీకి చెక్? విచారణపై తెలుగు రాష్ట్రాలలో చర్చ

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పెద్ద దుమారం రేపుతున్న అంశం – ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ అధికారులపై ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తగా, ఇప్పుడు ఈ వివాదంలో సినీరంగం కూడా తెరపైకి వచ్చింది.
ప్రముఖ నటి సమంత ఫోన్ ట్యాప్ చేశారని, అదే ఆమె మాజీ భర్త నాగచైతన్యతో విడాకులకు ఒక కారణమని గతేడాది నుంచే ప్రచారం సాగుతోంది. ఇప్పుడు ఈ చర్చకు మరింత ముద్ర వేస్తూ మరో నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరూ లేవనెత్తారు. రకుల్, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణలు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ విషయంలో ఆరోపణలు చేసిన దాఖలాలు ఉన్నాయి.
తాజాగా హెబ్బా పటేల్ పేరూ ఈ వివాదంలోకి వచ్చి చేరింది. బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఓ మీడియా చర్చలో మాట్లాడుతూ, హెబ్బా పటేల్ ఫోన్ ట్యాప్ అయ్యిందన్న సమాచారం తనకు అందిందని తెలిపారు. ఇది నిజమో కాదో తనకు తెలియదని స్పష్టంగా చెప్పినప్పటికీ, ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 618 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, వారి నుంచి వాంగ్మూలం నమోదు చేయడం ప్రారంభించారు.ఇందులో ఇప్పటికే 200 మందిని సిట్ బృందం విచారించింది.ఇందులో సినీ ప్రముఖులు కూడా ఉన్నారా? అనే ఉత్కంఠ మరింత పెరిగింది.
ఫోన్ ట్యాపింగ్ కు గురైన వారిని సిట్ కార్యాలయానికి పిలిపించకుండా, భద్రతా పరంగా అవసరమైతే వారి నివాసాలకే వెళ్లి అధికారులు స్టేట్మెంట్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో నటీమణులపై విచారణ జరుగుతుందా? వాస్తవాలు వెలుగు చూస్తాయా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
తద్వారా గత ఒకన్నర సంవత్సరంగా సాగుతున్న ఈ ప్రచారంలో ఎన్ని నిజాలు ఉన్నాయో, ఎవరు బాధితులయ్యారో, ట్యాపింగ్ వెనుక ఉన్న మోటివ్ ఏంటో త్వరలో బయటపడే అవకాశం ఉంది.
-
Home
-
Menu