
స్మశానం కథతో ‘ఉప్పు కప్పురంబు‘!

జాతీయ అవార్డు విజేత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమా థియేటర్లలో కాకుండా జులై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఈ మూవీలో యంగ్ హీరో సుహాస్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇంకా బాబు మోహన్, శత్రు, తాళ్ళూరి రామేశ్వరి ఇతర పాత్రల్లో నటించారు.
ఈ చిత్రాన్ని రాధికా ఎల్ నిర్మించగా, ఐ.వి. శశి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తెలుగు ఒరిజినల్గా తెరకెక్కిన ఈ చిత్రం.. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి పలు భాషల్లో అనువాద రూపంలో అందుబాటులోకి రాబోతుంది. లేటెస్ట్ గా ‘ఉప్పు కప్పురంబు‘ ట్రైలర్ రిలీజ్ చేశారు.
1990లలో చిట్టి జయపురం గ్రామం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. ఆ గ్రామంలో స్మశానం పూర్తిగా నిండిపోవడంతో చనిపోయినవారిని పూడ్చే స్థలం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి క్లిష్ట సమయంలో గ్రామ పెద్దగా బాధ్యతలు చేపట్టిన అమాయకురాలు అపూర్వ (కీర్తి సురేష్) ఆ సమస్యను ఎలా పరిష్కరించింది. ఈ క్రమంలో ప్రజల నుంచి ఆమెకు వచ్చిన సవాళ్లు ఏంటి? అనేది కథ. మొత్తంగా.. ట్రైలర్ తో ఆకట్టుకుంటున్న ‘ఉప్పు కప్పురంబు‘ ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
-
Home
-
Menu