ఓటీటీలోకి మలయాళం మూవీ "పార్ట్నర్స్"

ఓటీటీలోకి మలయాళం మూవీ పార్ట్నర్స్
X
గతేడాది జూలైలో థియేట్రికల్ గా విడుదలై యావరేజ్ టాక్‌తో కొనసాగింది. ఆ తర్వాత ఏడునెలలకు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందించిన మలయాళ చిత్రం "పార్ట్నర్స్". జనవరి 31న సైనా ప్లే ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ధ్యాన్ శ్రీనివాసన్, కళాభవన్ షాజాన్, రోనీ డేవిడ్, "బిచ్చగాడు" ఫేమ్ సాట్నా టైటస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది జూలైలో థియేట్రికల్ గా విడుదలై యావరేజ్ టాక్‌తో కొనసాగింది. ఆ తర్వాత ఏడునెలలకు ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

ఈ సినిమాకు నవీన్ జాన్ దర్శకత్వం వహించగా.. కథను రెండు టైమ్‌ పీరియడ్స్‌ అయిన 1990, 2024 మధ్య బ్యాంక్ స్కామ్స్ చుట్టూ నడిపించారు. ఒక పల్లెటూరి ప్రైవేట్ బ్యాంకులో జరిగిన పెద్ద స్కామ్ నేపథ్యంలో ఐదు స్నేహితుల ప్రయాణాన్ని, వారు ఎదుర్కొన్న అన్యాయానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాన్ని ఈ కథ చూపిస్తుంది.

కాసర్‌గడ్ సమీపంలోని ఒక ప్రైవేట్ బ్యాంకులో జరిగిన భారీ స్కామ్‌పై ఐటీ కమిషనర్ పార్థసారధి దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ స్కామ్‌కు సంబంధించి బ్యాంక్ మేనేజర్ కృష్ణకుమార్‌తో పాటు నలుగురు ఉద్యోగులపై అనుమానం కలగడం, వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలూ కథలో కీలక భాగంగా ఉంటాయి. స్కామ్‌లో వాళ్లు ఎలా ఇరుక్కుపోయారు? తమపై పడిన నిందను ఎలావిధంగా తొలగించుకున్నారు? అన్నది కథాంశం.

పార్ట్‌నర్స్ చిత్రంలోని కొన్ని కీలక ట్విస్ట్‌లు, హీరో, విలన్ మధ్య పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద సాధారణ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. మలయాళంలో హీరోగా, విలన్‌గా, వైవిధ్యమైన పాత్రలను పోషిస్తున్న ధ్యాన్ శ్రీనివాసన్ 2024లో ఏకంగా 15 సినిమాల్లో నటించడం గమనార్హం. ధ్యాన్ నటన, స్క్రిప్ట్‌ను అందించిన తీరు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచింది.

Tags

Next Story