ఎన్టీఆర్‌కు భారతరత్న కల సాకారమవుతుందా?

ఎన్టీఆర్‌కు భారతరత్న కల సాకారమవుతుందా?
X
తెలుగు వారి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈమధ్య మరింత జోరందుకుంది. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారక రామారావు.

తెలుగు సినిమా మరియు రాజకీయాల్లో విశిష్ట సేవలందించిన నందమూరి బాలకృష్ణకు తాజాగా కేంద్ర ప్రభుత్వం 'పద్మభూషణ్' పురస్కారాన్ని ప్రకటించింది. ఇది ఆయన అభిమానులకు, నందమూరి కుటుంబానికి గొప్ప గౌరవం. నటరత్న నందమూరి తారక రామారావు వారసుడిగా చిత్ర రంగంలోకి ప్రవేశించిన నందమూరి బాలకృష్ణ తండ్రి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ మాత్రమే దక్కించుకుంటే.. బాలకృష్ణ పద్మభూషణుడిగా నిలిచాడు.


అయితే తెలుగు వారి ఆరాధ్య దైవమైన ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఈమధ్య మరింత జోరందుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటడమే కాకుండా.. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని విశ్వ వ్యాప్తం చేసిన నటుడు, రాజకీయ నాయకుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు.


తెలుగు వారు వెండితెర ఇలవేల్పుగా కొలిచే నటరత్న నందమూరి రామారావు వెండితెరపై చేయని పాత్రంటూ లేదు. దేవుళ్ల పాత్రలకు యావత్ భారతదేశంలోనే తిరుగులేని నటుడు అనిపించుకున్న నటదిగ్గజం ఎన్టీఆర్. కేవలం నటనలోనే కాదు దర్శక నిర్మాతగానూ ఎన్నో అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్.


సినీ పరిశ్రమకు విశేష సేవలందించినందుకు 1968లోనే ఎన్టీఆర్ కు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అదే సంవత్సరం ఎన్టీఆర్ సహ నటుడు ఏఎన్నార్ కి పద్మశ్రీ అవార్డును అందించింది భారత ప్రభుత్వం. అయితే.. ఎన్టీఆర్ తన జీవితకాలం పద్మశ్రీతోనే సరిపెట్టుకుంటే ఏఎన్నార్ మాత్రం పద్మభూషణ్, పద్మవిభూషణ్, సినీ ఇండస్ట్రీలో అత్యుత్తమ అవార్డుగా భావించే దాదా సాహెబ్ ఫాల్కే వంటి పురస్కారాలను పొందారు.


ఎన్టీఆర్ కి కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు రాకపోవడానికి కారణం.. ఆయన రాజకీయాలతో బిజీ అవ్వడమే అంటారు. ఒక పార్టీకి అధినేత అయిన ఎన్టీఆర్ ను.. కేంద్రంలో అధికార పార్టీలు అవార్డుల విషయంలో చిన్న చూపు చూశాయనే అభిప్రాయాలున్నాయి. ఇక.. ఎన్టీఆర్ కు దేశంలోనే అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ దశాబ్దాలుగా వినిపిస్తున్నదే. మరి ఈసారైనా ఆ కల సాకారమవుతుందేమో చూడాలి.

Tags

Next Story