‘వార్ 2 ’ తెలుగు రైట్స్ పై క్లారిటీ వచ్చేసింది

ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ బాలీవుడ్ సినిమాల్లో “వార్ 2” ఒకటి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ హిందీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్కు భారీ క్రేజ్ ఉండటం, ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చే నేపథ్యంలో, “వార్ 2” తెలుగు థియేట్రికల్ హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ హక్కుల ధరలు ఎంత? ఎవరు ఈ హక్కులను దక్కించుకున్నారు? అన్న ఉహాగానాలు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బాలీవుడ్కు చెందిన ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని తన యాష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. సాధారణంగా ఆయన ఇతర ప్రాంతీయ నిర్మాతలకు హక్కులు ఇవ్వడం తక్కువగానే చేస్తారు. కానీ.. ఈసారి మాత్రం తెలుగు మార్కెట్ను మెరుగుగా మేనేజ్ చేయగల నిర్మాతలకు తెలుగు హక్కులు విక్రయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో, యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఎన్టీఆర్కు పెద్ద అభిమాని అయిన నాగ వంశీకి ఆయనతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అందుకే ఆయన హక్కులు తీసుకున్నారని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తల్ని నాగ వంశీ ఖండించారు. తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తూ..
“తారక్ అన్న ఫ్యాన్స్ అందరికీ మా బ్యానర్ ‘వార్ 2’ హక్కులు తీసుకున్నామని వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా ప్రాజెక్టుల గురించి ఏవైనా అధికారిక ప్రకటనలు ఉంటే, అవి మా అధికారిక హ్యాండిల్స్ ద్వారానే బయటికి వస్తాయి” అని స్పష్టం చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న “వార్ 2”లో హృతిక్ రోషన్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఒక పాట మినహా మిగతా షూటింగ్ పూర్తయింది. ఈ యాక్షన్ స్పెక్టాకిల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. "వార్ 2" తెలుగులో ఎలా ప్రమోట్ అవుతుందో వేచి చూడాల్సిందే.
-
Home
-
Menu