మోహన్ బాబు ‘పెదరాయుడు’ చిత్రానికి 30 ఏళ్ళు

కొన్ని సినిమాలు కేవలం వినోదాన్ని అందించడం మాత్రమే కాదు. అవి చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తాయి. మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అయితే, ఈ రెండు లక్షణాలనూ సమన్వయం చేసుకుని, ఒక కల్ట్ క్లాసిక్గా మారిన సినిమాలు చాలా అరుదు. అలాంటి ఆణిముత్యాల్లో మోహన్ బాబు ద్విపాత్రాభినయంతో మెస్మరైజ్ చేసిన ‘పెదరాయుడు’ ఒకటి. 1995లో విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనం, బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టిన తీరు.. ఇవన్నీ తెలుగు సినిమా చరిత్రలో ఓ గొప్ప మైలురాయి.
మోహన్ బాబు కెరీర్లోనే కాదు, ఆయన నిర్మాణ సంస్థ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘పెదరాయుడు’ ఒక మాస్టర్పీస్గా నిలిచిపోయింది. సరిగ్గా నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉండటం దీని గొప్పతనానికి నిదర్శనం. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘పెదరాయుడు’ 1995 జూన్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అదిరిపోయే టాక్తో థియేటర్లను షేక్ చేసింది.
సినిమా సక్సెస్ వెనక మోహన్ బాబు అసాధారణ నటన, గ్రిప్పింగ్ స్టోరీ లైన్తో పాటు, సూపర్స్టార్ రజినీకాంత్ మేజిక్ కూడా దీనికి యాడైంది. ఈ సినిమాలో రజినీ పోషించిన పాపారాయుడు పాత్ర సినిమాను ఏకంగా ఆకాశానికి ఎత్తేసింది. రజినీ ట్రేడ్మార్క్ స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్, మేకోవర్.. ప్రతి ఫ్రేమ్లోనూ అభిమానులకు పూనకం తెప్పించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, రజినీ తన విశ్వరూపాన్ని ఆవిష్కరించారు. తమిళ ఒరిజినల్ ‘నాట్టామై’ చిత్రం స్ఫూర్తిని అస్సలు తగ్గనీయకుండా, రవిరాజా తన దర్శకత్వ ప్రతిభతో సినిమాను ఒక విజువల్ ట్రీట్గా మలిచారు.
సినిమాలో సౌందర్య నటన, ముఖ్యంగా ఆమె పశ్చాత్తాపం చెందే సన్నివేశం, మహిళా ప్రేక్షకులను కన్నీళ్లలో ముంచెత్తింది. గ్రామీణ నేపథ్యంలో నీతి, న్యాయం, తీర్పులు, కుటుంబ సంబంధాల వంటి అంశాలతో తెలుగులో గతంలో చాలా సినిమాలు వచ్చినప్పటికీ, ‘పెదరాయుడు’ వాటన్నింటినీ మించి ఒక కొత్త ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. కోటి సమకూర్చిన సంగీతం సినిమాకు జీవం పోసింది. కథ, కథనం, డైలాగ్స్, సన్నివేశాలు ప్రతి అంశం ప్రేక్షకులను కట్టిపడేసింది.
-
Home
-
Menu