మోహన్ బాబు పై ఆరోపణలు.. సౌందర్య భర్త వివరణ!

దివంగత నటి సౌందర్యకు సంబంధించిన ఆస్తుల వివాదం తాజాగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సంచలన ఆరోపణలు చేస్తూ, సౌందర్య మరణం ప్రమాదవశాత్తు కాకుండా పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్యేనని పేర్కొన్నారు. అదేవిధంగా, నటుడు మోహన్ బాబు హైదరాబాద్ జల్ పల్లిలోని ఫామ్ హౌస్ను స్వాధీనం చేసుకున్నారని కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారాయి.
ఈ అంశంపై సౌందర్య భర్త రఘు స్పందిస్తూ, తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. మోహన్ బాబుతో తమ కుటుంబానికి ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని స్పష్టం చేశారు. గత 25 సంవత్సరాలుగా మంచు కుటుంబంతో తమకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయని, మోహన్ బాబును కుటుంబ సభ్యుడిలా గౌరవిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఆస్తుల విషయంలో మోహన్ బాబుపై జరుగుతున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.
సౌందర్య 2003లో రఘుతో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో ఓ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణించిన తర్వాత కూడా మోహన్ బాబుతో తమ కుటుంబానికి మంచి అనుబంధమే ఉందని, అటువంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయరాదని రఘు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదంపై స్పష్టత రావడంతో మోహన్ బాబు పేరు చుట్టూ వ్యాపించిన అనవసర చర్చకు తెరపడే అవకాశం ఉంది.
-
Home
-
Menu