కర్ణాటకలోని దేవాలయానికి సునీల్ శెట్టి అరుదైన బహుమతి

కర్ణాటకలోని దేవాలయానికి సునీల్ శెట్టి అరుదైన బహుమతి
X


బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి పెటా ఇండియా, సీయూపీఏ సహకారంతో, కర్ణాటకలోని శ్రీ ఉమామహేశ్వర వీరభద్రేశ్వర దేవస్థానానికి ఒక జీవరహిత మెకానికల్ ఏనుగును బహుమతిగా అందించారు. ఈ చర్య ఆలయాల్లో నిజమైన ఏనుగుల వినియోగానికి ప్రత్యామ్నాయంగా క్రూయాలిటీ ఫ్రీ ఆచారాలను ప్రోత్సహించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు మార్గం సుగమం చేస్తుంది.

ఈ ప్రాజెక్టుతో అనుసంధానమవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని సునీల్ శెట్టి పేర్కొన్నారు. "అడవి ఏనుగులు వన్యప్రాణి పరిసర వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. అవి విత్తనాలను వ్యాపింపజేసి, వృక్ష సంపద పెరుగుటకు సహాయపడతాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అవి ముఖ్య భూమిక పోషిస్తాయి. గనుక దేవాలయ ఆచారాలను పూజా విధానాలను కొనసాగించగలిగేలా చేస్తూనే, దేవుడి సృష్టిని రక్షించే ఈ కార్యక్రమంలో పెటా ఇండియా, సీయూపీఏ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని ఆయన అన్నారు.

పెటా ఇండియా అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, "ఉమామహేశ్వరుడు" అనే ఈ మెకానికల్ ఏనుగు నిజమైన ఏనుగులకు వాటి సహజ వాతావరణంలో జీవించే అవకాశాన్ని కల్పించడంతోపాటు ఆలయ ఉత్సవాలను హింసా రహితంగా నిర్వహించేందుకు మార్గం చూపిస్తుందని తెలిపారు.

ఈ మెకానికల్ ఏనుగు పర్యావరణ పరిరక్షణ కోణంలోనూ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. అడవి ఏనుగులు అటవీ వ్యవస్థలను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. విత్తనాలను వ్యాపింపచేసే వాటిగా అవి చెట్ల పెరుగుదల, వర్షపాతం నియంత్రణలో కూడా ప్రభావం చూపిస్తాయి. ఆలయాల్లో క్రూయాలిటీ ఫ్రీ సంప్రదాయాలకు ఇది ఒక కొత్త దశను ప్రారంభించినట్లవుతుంది.

Tags

Next Story