జగన్ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా - మంగళవారానికి హైకోర్టు తదుపరి విచారణ

సింగయ్య మృతి కేసులో ఐదు క్వాష్ పిటిషన్‌లపై హైకోర్టు విచారణ, జగన్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశం;

Update: 2025-06-27 09:07 GMT

సింగయ్య మృతి కేసులో దాఖలైన క్వాష్ పిటిషన్‌లపై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా ఇతరులపై నమోదైన కేసుల రద్దు కోసం దాఖలైన ఐదు క్వాష్ పిటిషన్‌లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు వచ్చే మంగళవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.సింగయ్య మరణానికి సంబంధించి జరిగిన పరిణామాల్లో తన పాత్ర లేదని, రాజకీయ కక్షలు కారణంగానే తనపై కేసు నమోదైందని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో వాదనలు వినాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది.

విచారణ పూర్తయ్యేంతవరకూ జగన్‌పై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. విచారణలో తుది తీర్పు వెలువడే వరకు జగన్‌కు ఊరట లభించినట్లైంది. క్వాష్ పిటిషన్‌లకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యతతో పరిశీలించాల్సిన అవసరం ఉందని, అన్ని పిటిషన్‌లను సమగ్రంగా విచారించాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం తెలిపింది.

ఈ కేసు నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని చర్చలు సాగుతున్నాయి. అధికార పక్షం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటున్నదని, ప్రతిపక్ష నేతపై న్యాయ ప్రక్రియ కొనసాగనుందని అంటుండగా, ప్రతిపక్ష నేత మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకారం అని ఆరోపిస్తున్నారు.విచారణ వాయిదా వేసిన నేపథ్యంగా తదుపరి విచారణపై అందరి దృష్టి నిలవనుంది. మంగళవారం జరగనున్న తదుపరి విచారణలో కీలక వాదనలు వినిపించే అవకాశముంది.

Tags:    

Similar News