ఆంధ్రరాష్ట్రంలో కల్తీ మద్యం తయారీపై ఎక్సైజ్ శాఖ ఉక్కుపాదం

మూడు కేంద్రాలపై దాడులు నిందితుల అరెస్ట్;

Update: 2025-06-25 13:26 GMT

రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ, పంపిణీ నెట్‌వర్క్‌లపై, ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు భారీ దాడులు నిర్వహించారు. వేర్వేరు బృందాలతో నిర్వహించిన ఈ దాడులలో పశ్చిమ గోదావరి, కోనసీమ, అనకాపల్లి జిల్లాలోని మూడు అక్రమ మద్యం తయారీ కేంద్రాలను కూల్చివేయడంతో పాటు, పెద్ద మొత్తంలో కల్తీ మద్యం, ముడి పదార్థాలు, యంత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కీలక నిందితులతో సహా అనేకమందిని అరెస్టు చేశారు. అబ్కారీ శాఖ ప్రధాన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఆదేశాల మేరకు కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో ఈ దాడులు నిర్వహించారు.

అమలాపురం, కాకినాడ ఎక్సైజ్ అధికారులు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం కోమరగిరిపట్నం గ్రామంలో జరిగిన భారీ కల్తీ మద్యం తయారీ యూనిట్‌పై దాడి చేశారు. ఈ దాడిలో 1,065 లీటర్ల స్పిరిట్, “ఎసి బ్లాక్” అనే లేబుల్‌తో ఉన్న 125 పెట్ బాటిల్స్, సీలింగ్ యంత్రం, నకిలీ క్యాప్స్, లేబుల్స్, తయారీలో ఉపయోగించే కరమెల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నేరేడుమిల్లి సుబ్రహ్మణ్యం, చావ్వకుల ప్రేమ్‌కుమార్ సహా ఎనిమిది మంది అరెస్టయ్యారు.

కోనసీమ దాడిలో అరెస్టు అయిన నిందితుల నుండి వచ్చిన సమాచారంతో, అధికారులు పాలకొల్లు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మరో అక్రమ మద్యం తయారీ యూనిట్‌పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో రెక్టిఫైడ్ స్పిరిట్, గ్లిసరిన్, కరమెల్, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్‌తో పాటు సీలింగ్ యంత్రం, ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న పులి రోషణి శీతల్ , బొర్ర సత్య అప్పారావు అరెస్టయ్యారు.

మరో ప్రత్యేక ఆపరేషన్‌లో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని శ్రీరాంపురం-కేశవరాం రోడ్డు సమీపంలోని కొబ్బరి తోట, చెబ్రోలు వద్ద విజయలక్ష్మీ ట్రేడర్స్ గోదాంలో కల్తీ మద్యం పంపిణీ నెట్‌వర్క్‌ను అధికారులు బహిర్గతం చేశారు. 1,247 నిప్ బాటిల్స్, మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రాపర్తి అప్పారావు, గణసాల శేషారావు వంటి నలుగురు అరెస్టయ్యారు.

ప్రధాన కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా మార్గదర్శకంలో, కల్తీ మద్యం తయారీకి ఉపయోగించిన ముడి పదార్థాలు, యంత్రాలు, నకిలీ బ్రాండ్ లేబుల్స్ మూలాలను గుర్తించే దిశగా దర్యాప్తు జరుగుతోంది. కమిషనర్ నిశాంత్ కుమార్, డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షణలో, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఈ అక్రమ చర్యలను అరికట్టడంలో ప్రభుత్వం కఠిన వైఖరిని ప్రదర్శించింది. ఈ తరహా అక్రమ కార్యకలాపాలపై నిఘాను కొనసాగిస్తామని ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.

Tags:    

Similar News