బీసీలకు 42% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలి,తెలంగాణాలో బీసీ సంఘాల హెచ్చరిక

రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు,కేంద్రం తక్షణ నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాలు;

Update: 2025-06-27 16:55 GMT

తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు తక్షణ చర్యలు తీసుకోవాలని బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ టీ. చిరంజీవులు (ఐఏఎస్, రిటైర్డ్) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్ష నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లి కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. లేదంటే బీసీలంతా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

శుక్రవారం తెలంగాణ ప్రెస్ క్లబ్‌ లో పలు బీసీ సంఘాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీసీల హక్కుల పరిరక్షణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆరోపించారు. బిల్లు రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లి మూడు నెలలు కావొచ్చిందని, అయినప్పటికీ కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు టీ. చిరంజీవులు.

బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కేంద్రం ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకోకపోవడంతో, ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఢిల్లీలో ధర్నాకు దిగాలని సూచించారు. బీసీలకు న్యాయం చేయాలంటే ఈ బిల్లును తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం అవసరమని స్పష్టం చేశారు .

బీసీలను బీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు ఎనిమిది రోజుల్లో చట్టం చేయగలిగితే, బీసీల రిజర్వేషన్ బిల్లుపై ఎందుకు దిశానిర్దేశం లేదు అని ప్రశ్నించారు బీసీ సంఘం నాయకులు.రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్లను చేర్చితే కోర్టులు వాటిని సమీక్షించలేవని, అదే బీసీల రక్షణకు మార్గమని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే జీవోలు కోర్టుల్లో నిలబడడంలేదని, అందుకే 9వ షెడ్యూల్ అవసరమని అన్నారు టీ. చిరంజీవులు.

Tags:    

Similar News