దసరా విలన్ కు రోడ్డు ప్రమాదం

Update: 2025-06-06 11:15 GMT

మలయాళ నటుడు షైన్ టామ్ చాకో కుటుంబం ఈరోజు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో చిక్కుకుంది. ఈ ఘటనలో ఆయన తండ్రి సీ.పీ. చాకో (70) అక్కడికక్కడే మృతి చెందగా, షైన్‌తో పాటు ఆయన తల్లి మరియా కార్మెల్, సోదరుడు జో జాన్ చాకో, డ్రైవర్ అనీస్లకు తీవ్ర గాయాలయ్యాయి.

త్రిస్సూర్ నుంచి బెంగళూరు వైద్య పరీక్షల నిమిత్తం ప్రయాణిస్తున్న సమయంలో, ధర్మపురి జిల్లా పరిధిలోని పరైయూర్ వద్ద వారి కారు ఓ నిలిచిన లారీని ఢీకొట్టింది. డ్రైవర్ అనీస్ వివరించిన ప్రకారం, లారీ అకస్మాత్తుగా లేన్ మార్చిన నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారు వేగం గంటకు 80–100 కిమీ ఉండగా, ముందే సీట్లో కూర్చున్న సీ.పీ. చాకో తీవ్ర తలగాయానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.

షైన్ టామ్ చాకో కి కుడి చేయి విరిగింది. మరియా కార్మెల్ కి తుంటి భాగంలో గాయాలయ్యాయి. వీరిని ప్రాథమిక చికిత్స కోసం పాలకోడ్ ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ధర్మపురి మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. సీ.పీ. చాకో మృతదేహాన్ని ధర్మపురి మార్చురీలో ఉంచారు.

2011లో ‘గద్దామ’తో సినీరంగంలోకి అడుగుపెట్టిన షైన్, మలయాళం చిత్రాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లోను నటించారు. ‘దసరా’, ‘డాకు మహారాజ్’, ‘రంగబలి’ వంటి చిత్రాల్లో ఆయన నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

Tags:    

Similar News