'ఓజీ' సెలబ్రేషన్స్.. పవర్ఫుల్ స్పీచ్

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కించిన మాఫియా యాక్షన్ ఎంటర్టైనర్ 'ఓజీ' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. సెప్టెంబర్ 25న విడుదలైన ఈ సినిమా మొదటి రోజునుంచే అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో కోరుకున్న పవన్ పవర్ఫుల్ ఎంట్రీలు, ఎలివేషన్స్, యాక్షన్ సీన్స్తో పాటు తమన్ ఇచ్చిన బలమైన బీజీఎమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కేవలం 4 రోజుల్లోనే రూ.250 కోట్లు దాటేసింది.
'ఓజీ' సక్సెస్ సాధించిన నేపథ్యంలో మూవీ టీమ్ బ్లాక్బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్ గా నిలిచింది. పవర్స్టార్ తన యూనిక్ స్టైల్లో స్పీచ్ ఇచ్చాడు. 'తెల్ల చొక్కా, జుబ్బా వేసుకుని రావద్దు సార్.. బ్లాక్ డ్రెస్లో, కళ్లజోడు పెట్టుకుని రావాలి' అని టీమ్ చెప్పిందని, అందుకే గన్తో వచ్చానని, తనకు గన్స్ మీద ఉన్న ప్యాషన్ను గుర్తుచేసుకుంటూ చెప్పిన పవన్ మాటలు అభిమానులను అలరించాయి. 'మద్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ని. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన వెపన్ని చూసినప్పుడు నాకు పిచ్చి ఆనందం కలిగింది' అని చెప్పిన ఆయన, అభిమానుల కోసం గన్తో ఫోజులు ఇచ్చాడు.
సుజీత్ కేవలం ఐదు నిమిషాల స్టోరీ చెప్పగానే తాను అంగీకరించానని పవన్ చెప్పాడు. 'ఆ కథలో సమురాయ్ కత్తి, జపనీస్ డ్రెస్, గ్యాంగ్స్టర్స్ తుపాకులు ఉన్నాయి.. కానీ పెద్ద డైలాగ్స్ లేవు. అది నాకు బాగా నచ్చింది. ఒకోసారి నమ్మి రిస్క్ చేయాల్సిందే. నేను ఫెయిల్యూర్కి భయపడను' అని స్పష్టం చేశాడు పవర్ స్టార్.
రాజకీయంగా విభేదించే పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ ఒకే ఫ్రేమ్లో కనిపించడం 'ఓజీ'కి అదనపు హైలైట్. రియల్ లైఫ్లో విభేదాలు ఉన్నా, సినిమాలో ఈ ఇద్దరూ అద్భుతమైన కెమిస్ట్రీ చూపించారు. పవన్ గంభీర గా, ప్రకాష్ రాజ్ సత్యదాదాగా కనిపించి కథకు బలమైన పునాది వేశారు. ఈ ఈవెంట్లో ప్రకాష్ రాజ్ గురించి పవన్ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. 'నాకు ఎవరితోనూ ఇబ్బంది ఉండదు. నా పొలిటికల్ అభిప్రాయాలు వేరే.. కానీ సినిమా అంటే నాకు అన్నం పెట్టిన తల్లి. నేను కోరుకున్నది ఒక్కటే – సెట్లో రాజకీయాలు వద్దు. ప్రకాష్ రాజ్ బ్రిలియంట్ యాక్టర్. ప్రొఫెషనల్గా ఉంటే నేనూ ప్రొఫెషనల్గా ఉంటాను. ఆయనకు నా మనస్ఫూర్తి ధన్యవాదాలు' అని పవన్ అన్నాడు.
-
Home
-
Menu