వీరమల్లు పై కట్టప్ప ఫైర్

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమిళనాడు పర్యటన ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపింది. ‘మురుగన్ మానాడు’ పేరిట చెన్నైలో జరిగిన బీజేపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్.. తన ప్రసంగంలో నకిలీ సెక్యులరిజంపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పవన్ ప్రసంగంకు అక్కడి రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల నుంచి గట్టి వ్యతిరేకత ఎదురవుతుంది. ముఖ్యంగా, ప్రముఖ నటుడు సత్యరాజ్, డీఎంకే నాయకుడు శేఖర్ బాబు లాంటి వారు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన రాజకీయ జోక్యంపై హెచ్చరికలు జారీ చేశారు.
సత్యరాజ్, విడుతలై చిరుతైగల్ కచ్చి (వీకేసీ) పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, దేవుడి పేరుతో రాజకీయాలు చేసే ప్రయత్నాలను తమిళ ప్రజలు సహించరని స్పష్టం చేశారు. ‘పెరియార్ సిద్ధాంతాలను నమ్మే మేము మోసపోము. మురుగన్ మానాడు పేరిట తమిళులను తప్పుదోవ పట్టించాలనుకుంటే, అది మీ అజ్ఞానమే‘ అని సత్యరాజ్ విమర్శించారు. తమిళనాడు ప్రజలు తెలివైనవారని, ఇక్కడ రాజకీయ ఆటలు సాగవని ఆయన హెచ్చరించారు.
మరోవైపు, డీఎంకే నేత, మంత్రి శేఖర్ బాబు కూడా పవన్ పర్యటనపై తీవ్రంగా స్పందించారు. ‘తమిళనాడుతో మీకు ఏ సంబంధం? మా రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దు‘ అని శేఖర్ బాబు పవన్ను ప్రశ్నించారు. అంతేకాక, ‘తమిళనాడు పట్ల అంత ప్రేమ ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవండి‘ అని సవాల్ కూడా విసిరారు.
అయితే మరోవైపు చూస్తే, ఈ మొత్తం ఘటనలో పవన్ ప్రయోజనం కూడా లేకపోలేదు. దేశవ్యాప్తంగా తన హిందూత్వ భావజాలానికి అనుగుణంగా ఒక క్లియర్ స్టాండ్ తీసుకుంటూ.. జాతీయ స్థాయిలో తన మార్కు పెంచుకునే ప్రయత్నం ఇది కావచ్చు. బీజేపీతో మైత్రీ ఉన్న పవన్కు మురుగన్ సభ ఒక వేదికగా మారిందని చెప్పవచ్చు.
-
Home
-
Menu